దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. లీటర్ పెట్రోల్ పై 87 పైసలు, డీజిల్ పై 91 పైసల మేర పెరిగింది. ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు 0.87 పైసలు పెరిగి 99.54 రూపాలయకు చేరుకోగా, డీజిల్ ధర 0.91 పైసల మేర పెరిగి లీటరుకు రూ. 92.48గా నమోదైంది. దేశీయ ఎల్పిజి సిలిండర్ ధరలలో ఎటువంటి మార్పు లేదు, ఇది వినియోగదారులకు కొంత ఊరట కలిగించింది.
సరిగ్గా 10 రోజుల వ్యవధిలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం ఇది మూడోసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తొలుత పెట్రోల్, డీజిల్ లీటర్ పై ఏకంగా రూ.3.50 పైసల మేర పెంచాయి ఆయిల్ కంపెనీలు. ఆ తర్వాత ఈ నెల 19వ తేదీన మళ్లీ వాటి రేట్లను సవరించాయి. లీటర్ పెట్రోల్ పై 87 పైసలు, డీజిల్ పై 91 పైసలు పెంచాయి. ఇప్పుడు కూడా అవే రేట్లను ప్రాతిపదికన తీసుకున్నాయి. మళ్లీ అంతే మొత్తంలో ఇంధన రేట్లను సవరించాయి. దీంతో ప్రయాణం మరింత భారం కానుంది వాహనదారులకు. ఈ పెరుగుదల ఇప్పట్లో ఆగకపోవచ్చు. పశ్చిమాసియాలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో రోజూ 1,000 కోట్ల రూపాయల మేర నష్టాన్ని చవి చూస్తూ వస్తోన్నామని చెబుతోన్నాయి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు. దీన్ని భర్తీ చేసుకోవడానికి పెట్రోల్, డీజిల్ పై కనీసం 25 రూపాయలను పెంచాల్సి ఉంటుందనీ కేంద్రానికి ఇదివరకే ప్రతిపాదనలు సైతం పంపించాయి.




Total views : 89113