మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయవరం సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు..ముందు వెళ్తున్న టిప్పర్ను ఢీకొట్టింది. వెంటనే బస్సుకు మంటలు అంటుకుని పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 12కు చేరింది. పలువురికి తీవ్రగాయాలవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. సమాచారమందుకొని అక్కడికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సహాయకచర్యలు చేపట్టారు.
హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా పామూరుకు దాదాపు 40 మంది ప్రయాణికులతో బయలుదేరిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు..మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలోని క్వారీల వద్దకు రాగానే, ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీని బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు బస్సు డీజిల్ ట్యాంక్ పగిలిపోయి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వేగంగా వ్యాపించిన మంటల్లో బస్సు, టిప్పర్ రెండూ చిక్కుకున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండటంతో ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కొందరు ప్రయాణికులు బస్సు అద్దాలు పగలగొట్టుకుని బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. మరికొంతమంది మాత్రం మంటల్లో చిక్కుకుని బయటకు రాలేక సజీవ దహనమయ్యారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. గాయపడినవారిని మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో వారిని గుర్తించడం పోలీసులకు కష్టంగా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది.





Total views : 77709