శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలం పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ఆయన ప్రధానంగా రెండు ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. భద్రాద్రిలోని మిథిలా స్టేడియంలో వైభవంగా జరిగే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. భద్రాచలం ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రకటించిన 586 కోట్ల మాస్టర్ ప్లాన్లో భాగంగా, మొదటి దశలో 351 కోట్లతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేస్తారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ ప్రాజెక్టును మూడు దశల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది తెలంగాణ సర్కార్. మొదటి దశలో గోదావరి ఘాట్ల అభివృద్ధి , ఆలయ సముదాయ విస్తరణ, ఇతర మౌలిక వసతుల కల్పన వంటి పనులు చేపడతారు. రాబోయే గోదావరి పుష్కరాల నాటికి భక్తులకు అసౌకర్యం కలగకుండా తొలి దశ పనులను 2027 మార్చి నాటికి పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. సీఎం భద్రాద్రి పర్యటనలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కూడా ముఖ్యమంత్రి వెంట ఉండనున్నారు. జిల్లా యంత్రాంగం భద్రాచలంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఇప్పటికే అధికారులకు సూచించారు.
Tag:






Total views : 78222