దేశ రాజధాని ఢిల్లీ లోని జంతర్ మంతర్ పరిసర ప్రాంతాల్లో మళ్లీ హై టెన్షన్ వాతావరణం నెలకొంది. శాంతియుతంగా సాగుతున్న ఆందోళనల మధ్య కొందరు అల్లరిమూకలు రెచ్చిపోవడంతో హింస చెలరేగింది. విధుల్లో ఉన్న పోలీసులను లక్ష్యంగా చేసుకుని దుండగులు ఉన్నట్టుండి రాళ్లదాడికి పాల్పడటంతో పరిస్థితి ఒక్కసారిగా చేయిదాటిపోయింది. ఈ ఆకస్మిక దాడిలో ఇద్దరు ఏసీపీలతో పాటు ఇద్దరు పోలీస్ ఇన్స్పెక్టర్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు వారిని తోటి సిబ్బంది చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అల్లరిమూకల రాళ్ల దాడితో అప్రమత్తమైన పోలీసులు అదనపు బలగాలను రంగంలోకి దింపి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, రాజధాని ఢిల్లీలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, సోషల్ మీడియా ద్వారా ఆకతాయిలు పుకార్లు వ్యాప్తి చేయకుండా ఉండేందుకు అధికారులు కఠిన చర్యలకు దిగారు. జంతర్ మంతర్ పరిసర ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఆంక్షలు విధించారు. ప్రస్తుతం ఆ ప్రాంతం అంతా పోలీసుల, భద్రతా బలగాల అదుపులో ఉందని ఉన్నతాధికారులు వెల్లడించారు.
Tag: