విశాఖ ముఖచిత్రాన్ని మార్చే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఐటీ దిగ్గజ కంపెనీ క్యాప్ జెమినీ సీఈవో ఐమాన్ ఇజ్జత్తో భేటీ అయ్యారు మంత్రి నారా లోకేష్..విశాఖలో భారీ డెవలప్మెంట్ సెంటర్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో ..విశాఖపట్నం ఇప్పటికే డేటా సెంటర్ హబ్గా మారుతోందని వారికి వివరించారు లోకేష్. దేశంలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ పనులు త్వరలోనే విశాఖలో ప్రారంభం కానున్నాయని తెలిపిన మంత్రి…ఇప్పటికే TCS, కాగ్నిజెంట్ వంటి సంస్థలు విశాఖలో తమ కార్యకలాపాలను ప్రారంభించాయని గుర్తుచేశారు. మరో మూడు నెలల్లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రానుండటం ఐటీ ఎకో సిస్టమ్కు మరింత బలాన్నిస్తుందని వెల్లడించారు. విశాఖలో కనీసం 20 వేల మందికి ఉపాధి కల్పించే సామర్థ్యం గల ఐటీ డెవలప్మెంట్ సెంటర్, క్లౌడ్ సర్వీసెస్, బీపీఎం వర్టికల్స్ను ఏర్పాటు చేయాలని కోరారు. వీటితో పాటు మరికొన్ని కీలక అంశాలపై చర్చించారు.
మంత్రి లోకేష్ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించారు ఐమాన్ ఇజ్జత్. 1967లో పారిస్ కేంద్రంగా ప్రారంభమైన తమ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 3.4 లక్షల మంది ఉద్యోగుల్లో, దాదాపు 2 లక్షల మంది భారత్లోనే ఉన్నారని వెల్లడించారాయన. ప్రస్తుతం హైదరాబాద్, చెన్నై సహా 13 భారతీయ నగరాల్లో క్యాప్ జెమినీ కార్యకలాపాలు సాగిస్తోందని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను తాము నిశితంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.




Total views : 54696