నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామివారి గుట్టకింద ఈ ఘటన జరిగింది. బొమ్మల దుకాణంలో చెలరేగిన మంటలు..క్షణాల్లోనే పక్కనే ఉన్న షాపులకు అంటుకున్నాయి. ఈ ఘటనలో 10కి పైగా షాపులు అగ్నికి ఆహుతయ్యాయి. భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ప్రమాద తీవ్రతకు రెండు గ్యాస్ సిలిండర్లు సైతం పేలినట్లు చెబుతున్నారు స్థానికులు. ఘటనాస్థలానికి సమీపంలో ఉన్న గ్రామపంచాయతీ కార్యాలయానికీ మంటలు వ్యాపించాయి. దీంతో కార్యాలయంలోని పలు దస్త్రాలు కాలిపోయాయి.
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేస్తున్నారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దుకాణాలు కాలి బూడిదయ్యాయి. ఈ ఘటనలో దాదాపు రెండున్న కోట్ల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్లు తెలిపారు స్థానిక సర్పంచ్. పోలీసులు, గ్రామస్థులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో దుకాణాల్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.