ఏపీ రాష్ట్ర మంత్రిమండలి సమావేశం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, పరిపాలన సంస్కరణలే లక్ష్యంగా సుదీర్ఘంగా చర్చించి అనేక అంశాలను ఆమోదించారు. అమరావతి రాజధాని విషయంలో భవిష్యత్తులో ఎలాంటి మార్పులకు ఆస్కారం లేకుండా పటిష్టమైన చర్యలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్ 5ను సవరించాలని కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం చేయడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సెక్షన్ 5(2)లో “ఎట్ అమరావతి” అనే పదాన్ని, అలాగే అమరావతి అంటే ఏపీసీఆర్డీఏ చట్టం కింద నోటిఫై చేసిన ప్రాంతం అని స్పష్టంగా చేర్చాలని ప్రతిపాదించారు. గత ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో సృష్టించిన గందరగోళం పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజకీయ కక్ష సాధింపులతో రాజధానిని మార్చే దుశ్చర్యలకు పాల్పడకుండా, అమరావతిని శాశ్వత రాజధానిగా, ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పార్థసారథి వివరించారు.
రాష్ట్రంలో పేరుకుపోయిన కేసుల భారాన్ని తగ్గించి, ప్రజలకు సత్వర న్యాయం అందించే లక్ష్యంతో న్యాయవ్యవస్థను బలోపేతం చేసేందుకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. హైకోర్టు ప్రతిపాదన మేరకు రాష్ట్రవ్యాప్తంగా 96 కొత్త కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ 1,730 పోస్టులను త్వరలో విడుదల చేసే జాబ్ క్యాలెండర్లో చేర్చే అవకాశాలను పరిశీలించాలని సీఎం ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం, వడ్డెర సామాజిక వర్గానికి ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు చారిత్రక నిర్ణయం తీసుకుంది. వడ్డెర సంఘాలకు క్వారీ లీజులను ప్రాధాన్యత ప్రాతిపదికన కేటాయించడంతో పాటు, ప్రీమియం, సీనరేజ్ ఫీజులో 50 శాతం రాయితీ ఇవ్వడానికి రూపొందించిన మార్గదర్శకాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పూర్తిపై ప్రభుత్వం దృష్టి సారించింది. హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్టు ఫేజ్-1లో మిగిలిపోయిన పనులను పూర్తి చేయడానికి, పొంగనూరు బ్రాంచ్ కెనాల్ నిర్మాణంలో పెరిగిన అంచనా వ్యయానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కర్నూలు జిల్లాలోని గురు రాఘవేంద్ర ప్రాజెక్ట్ కింద 7 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ల నిర్వహణకు రూ.4.40 కోట్లు మంజూరు చేసింది.





Total views : 78236