191
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి జాతీయ రహదారిపై తెల్లవారుజామున పెను ప్రమాదం సంభవించింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న టిప్పర్ను వెనుక నుండి వేగంగా వచ్చిన ఓ కంటైనర్ గూడ్స్ క్యారియర్ బలంగా ఢీకొట్టింది. ఈ భీకర సంఘటనలో ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలోనే కంటైనర్ క్యాబిన్ను మంటలు చుట్టుముట్టడంతో, లోపల ఉన్న డ్రైవర్ బయటకు వచ్చే అవకాశం లేక సజీవ దహనమయ్యారు. మంటల ధాటికి వాహనం పూర్తిగా కాలిబూడిదైంది. సమాచారం అందుకున్న వీరవల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి అతివేగమే కారణమా లేక డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడా అన్న కోణంలో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.