ఏపీని పారిశ్రామికంగా, సాంకేతికంగా అగ్రస్థానంలో నిలబెట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా తిరుపతి జిల్లాలోని శ్రీసిటీలో ప్రపంచ ప్రసిద్ధ ఎయిర్ కండిషనర్ల తయారీ సంస్థ ‘క్యారియర్ గ్లోబల్’ యూనిట్కు రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు కోసం క్యారియర్ సంస్థ సుమారు వెయ్యి కోట్ల భారీ పెట్టుబడి పెట్టనుంది. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 3,000 మందికి ఉపాధి, జీవనోపాధి అవకాశాలు లభించనున్నాయి.
క్యారియర్ కేవలం ఒక కంపెనీ కాదని, ప్రపంచ శీతలీకరణ సాంకేతికతలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన మార్గదర్శి అని మంత్రి లోకేష్ ప్రశంసించారు. తన జీవితంలో కొనుగోలు చేసిన మొట్టమొదటి ఏసీ కూడా క్యారియర్ బ్రాండ్దేనని ఆయన గుర్తుచేసుకున్నారు. డేటా సెంటర్లను ఆకర్షిండమేకాదు, వాటికి అవసరమైన పూర్తి తయారీ పర్యావరణ వ్యవస్థను (ఎకోసిస్టమ్) నిర్మించే హబ్గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డేటా సెంటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో తీవ్రమైన పోటీ నెలకొని ఉందని, ఈ రేసులో ఏపీ ముందు వరుసలో నిలుస్తుందని లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. డేటా సెంటర్లకు అత్యాధునిక కూలింగ్ సిస్టమ్స్, అధిక సామర్థ్యం గల చిల్లర్లు, పవర్ ఎలక్ట్రానిక్స్, ప్రెసిషన్ మాన్యుఫ్యాక్చరింగ్ వంటివి అత్యంత కీలకమని, వీటికి అవసరమైన బలమైన సహాయక పర్యావరణ వ్యవస్థను నిర్మించడంపై దృష్టి సారించామని వివరించారు.ఈ బృహత్తర లక్ష్యంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ను, శ్రీసిటీని ఎంచుకున్నందుకు క్యారియర్ గ్లోబల్ కార్పొరేషన్కు ఆయన స్వాగతం పలికారు. ఈ పెట్టుబడి రాష్ట్ర డిజిటల్, పారిశ్రామిక అభివృద్ధిని బలోపేతం చేసే దిశగా ఒక ముఖ్యమైన ముందడుగు అని మంత్రి లోకేష్ అభివర్ణించారు.





Total views : 75107