పశ్చిమాసియాలో కొంతకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఒక్కసారిగా తీవ్రస్థాయికి చేరాయి. అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో నౌకలను అడ్డుకుంటున్న ఇరాన్పై అమెరికా వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఇరు దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం పూర్తిగా ‘ముగిసిపోయిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే యూఎస్ సెంట్రల్ కమాండ్ ఈ దాడులు చేసింది.
టర్కీలోని అంకారాలో జరిగిన నాటో శిఖరాగ్ర సదస్సు ముగిసిన అనంతరం ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా ఇరాన్లోని పేలుళ్లకు సంబంధించిన వీడియోలను పంచుకుంటూ హెచ్చరికలు జారీ చేశారు. జూన్ 17న కుదిరిన అవగాహన ఒప్పందం పూర్తిగా విఫలమైందని, ఇరాన్ పాలకులు నమ్మదగిన వ్యక్తులు కారని ఆయన మండిపడ్డారు. అయితే ఈ ఘర్షణలు సుదీర్ఘ కాలం కొనసాగవని, అమెరికా సైన్యం ఈ పనిని చాలా వేగంగా ముగిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
అమెరికా దాడులతో ఇరాన్ దక్షిణ తీర ప్రాంతం వణికిపోయింది. ఇరాన్ అతిపెద్ద నౌకాశ్రయం, ఇరాన్ నావికాదళం, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ IRGC ప్రధాన స్థావరమైన ‘బందర్ అబ్బాస్’ నగరంలో భారీ పేలుళ్లు జరిగాయి. అలాగే చాబహార్, కొనారక్ ప్రాంతాల్లోనూ అమెరికా దళాలు విరుచుకుపడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోవడమే కాకుండా చాబహార్లోని షాహిద్ బెహెష్తీ పోర్ట్, కలాంతరి పోర్ట్, మారిటైమ్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ క్షిపణుల శకలాలు చాబహార్లోని ఒక ఆసుపత్రిని కూడా తాకినట్లు ఇరాన్ మీడియా పేర్కొంది. ఇరాన్షాహర్, సిరిక్, బుషెహర్, అబు మూసా దీవులపై కూడా అమెరికా దాడులు జరిగాయి.
ఈ పరిణామాలపై స్పందించిన ఇరాన్ అమెరికా సైనిక స్థావరాలపై భారీ ప్రతిఘటన దాడి”కి సిద్ధమవుతున్నట్లు ప్రకటించింది. హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే నౌకల భద్రతా బాధ్యత ఇరాన్దేనని ఒప్పందంలో ఉందని, అమెరికా దానిని ఉల్లంఘించిందని ఇరాన్ విదేశాంగ శాఖ ఆరోపించింది. ఇరాన్ ఇప్పటికే బహ్రెయిన్, కువైట్లలోని అమెరికా మిలటరీ స్థావరాలపై దాడులు చేసింది. ఈ యుద్ధ మేఘాల ప్రభావం ప్రపంచ ఇంధన మార్కెట్పై పడింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు ఒక డాలర్ పెరిగి 79.28 డాలర్లకు చేరుకుంది.





Total views : 194411