ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యానికి తావులేకుండా… రియల్టైమ్లో స్పందించే పాలన అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్లో పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించడంతో పాటు… రాష్ట్రవ్యాప్తంగా జీరో వేస్ట్ పట్టణాల లక్ష్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. సమస్యల పరిష్కారమే అధికారుల పనితీరుకు గీటురాయి అని పేర్కొన్నారు.
ఐదు రోజుల జిల్లా పర్యటన అనంతరం అమరావతికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు… సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజల సమస్యలపై ప్రభుత్వ స్పందన, వివిధ శాఖల సేవలు, పీజీఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం, పట్టణ పరిశుభ్రత, గంజాయి నిర్మూలన తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులకు రియల్టైమ్లో స్పందించడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్లో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను శాఖలవారీగా విభజించి… ప్రత్యేక కార్యాచరణతో త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఫలితాలు కనిపించేలా కలెక్టర్లు, ఉన్నతాధికారులు బాధ్యత వహించాలని సూచించారు.
రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రం 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని… అత్యవసర ఘటనల్లో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎం స్పష్టం చేశారు. విశాఖ తీరంలో బోటు ప్రమాదం వంటి సంఘటనల్లో తక్షణ స్పందనే ప్రభుత్వ పనితీరుకు ప్రమాణమని పేర్కొన్నారు. పట్టణ పరిశుభ్రతపై కూడా సీఎం ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పేరుకుపోయిన 23 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను మూడు నెలల్లోగా తొలగించాలని ఆదేశించారు. ఇంటింటికీ చెత్త సేకరణ, స్వచ్ఛ రథాల నిర్వహణకు స్పష్టమైన కార్యాచరణ అమలు చేసి… జీరో వేస్ట్ పట్టణాలు లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.
గిరిజన ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్ల ఏర్పాటు, మహిళలపై నేరాల నియంత్రణ, గంజాయి నిర్మూలన, ప్రభుత్వ పథకాల ఫలితాల విశ్లేషణపై కూడా సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు మొబైల్ నెట్వర్క్ అందుబాటులోకి తీసుకురావడానికి టెలికాం టవర్ల ఏర్పాటును వేగవంతం చేయాలని సూచించారు. అలాగే ప్రభుత్వ శాఖల పనితీరులో ఏఐ, డిజిటల్ టెక్నాలజీ వినియోగాన్ని మరింత విస్తరించాలని ఆదేశించారు. ప్రజా సమస్యలకు వేగవంతమైన పరిష్కారం… సాంకేతికత ఆధారిత పాలన… పరిశుభ్రమైన పట్టణాలు… సమర్థవంతమైన పరిపాలనే ప్రభుత్వ ప్రాధాన్యత అని మరోసారి స్పష్టం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు… ప్రతి శాఖ ఫలితాల ఆధారంగా పనిచేసేలా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.





Total views : 192558