2008 అహ్మదాబాద్ పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో 38 మందికి ఉరిశిక్ష, 11 మందికి జీవితఖైదు విధించింది. ఈ కేసులో 2022లో ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధిస్తూ ఆ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్ధించింది. పేలుళ్ల ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని ఈ మేరకు జస్టిస్ ఏవై కోగ్జే, జస్టిస్ ఎస్జే దవేలతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది.
2008 జులై 26న గుజరాత్లోని అహ్మదాబాద్లో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. కేవలం 70 నిమిషాల వ్యవధిలోనే ఏకంగా 21 ప్రాంతాల్లో వరుస బాంబు పేలుళ్లతో విరుచుకుపడ్డారు. రద్దీగా ఉండే మార్కెట్లు, బస్సులు మాత్రమే కాకుండా, మొదటి విడత పేలుళ్లలో గాయపడిన వారికి చికిత్స అందిస్తున్న సివిల్ హాస్పిటల్ను టార్గెట్ చేస్తూ రెచ్చిపోయారు. ఈ పేలుళ్లలో 56 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా 246 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన సిటీ క్రైమ్ బ్రాంచ్.. 100 మందికి పైగా నిందితులుగా పేర్కొంది. 78 మందిపై విచారణ జరిగింది. అహ్మదాబాద్లో నమోదైన 20 ఎఫ్ఐఆర్లు, సూరత్లో నమోదైన 15 ఎఫ్ఐఆర్లతో కలిపి మొత్తం 35 కేసులను విలీనం చేసి సుదీర్ఘ విచారణ జరిపారు. ఈ క్రమంలో 9 మంది వేర్వేరు న్యాయమూర్తుల ముందు 1,163 మంది సాక్షులను ప్రాసిక్యూషన్ విచారించింది. భద్రతా కారణాల దృష్ట్యా 26 మంది కీలక సాక్షుల పేర్లను గోప్యంగా ఉంచారు.
గుజరాత్ హైకోర్టు హైకోర్టుకు చేరిన ఈ కేసులో గత రెండున్నరేళ్లుగా దాదాపు 248 సార్లు అప్పీళ్లపై ధర్మాసనం సుదీర్ఘ విచారణ జరిపింది. విచారణ సందర్భంగా నిషేధిత ఉగ్రవాద సంస్థలు ఇండియన్ ముజాహిదీన్, సిమిలకి చెందిన ఉగ్రవాదులు కలిసి ఈ దారుణ కుట్రకు పాల్పడినట్లు ప్రాసిక్యూషన్ కోర్టులో బలంగా నిరూపించింది. దీంతో నిందితులపై దేశద్రోహం, హత్య నేరాలతో పాటు కఠినమైన ఉగ్రవాద నిరోధక చట్టం ఉపా కింద మోపిన చార్జీలను న్యాయస్థానం సమర్థించింది. ఈ మేరకు దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధిస్తూ ఇవాళ తుది తీర్పు వెలువరించింది. అయితే దేశ చరిత్రలోనే ఒకే కేసులో ఇంత పెద్ద సంఖ్యలో (38 మందికి) ఉరిశిక్షలు ఖరారు కావడం ఇదే తొలిసారి.





Total views : 192559