కేరళలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. తాజాగా వయనాడ్లో భారీ విపత్తు సంభవించింది. మేప్పాడి సమీపంలోని కల్లాడి వద్ద ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో వయనాడ్ – మలప్పురం జిల్లాలను కలుపుతూ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న‘టన్నెల్ రోడ్ ప్రాజెక్ట్’ సైట్ పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. నిర్మాణ సంస్థకు చెందిన కార్యాలయ కంటైనర్లు, కార్మికుల బస్సులు, కార్లు, జేసీబీలు వంటి భారీ యంత్రాలు పూర్తిగా మట్టి దిబ్బల కింద కూరుకుపోయాయి. ప్రమాదం జరిగిన సమయంలో పనుల్లో ఉన్న సుమారు 30 నుంచి 50 మంది వరకు కార్మికులు మట్టి శిథిలాల కింద చిక్కుకుని ఉండవచ్చని రెస్క్యూ అధికారులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. స్థానికులు వెంటనే స్పందించి ముగ్గురు కార్మికులను ప్రాణాలతో కాపాడగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడటంతో వారిని ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘోర ప్రమాదం పై కేరళ ముఖ్యమంత్రి వీడీ సతీశన్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించారు. రాపిడ్ రెస్పాన్స్ టీమ్తో పాటు కోజికోడ్ నుండి NDRF బృందాలు రంగంలోకి దిగి యుద్ధప్రాతిపదికన రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. అయితే, భారీ వృక్షాలు కూలిపోవడం, మీనాక్షి బ్రిడ్జ్ సమీపంలోని చిన్న నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. మరోవైపు ఈ ప్రాంతంలో కొన్ని ఇళ్లతో పాటు హోమ్స్టేలు కూడా ఉండటంతో, వర్షాల సీజన్ కారణంగా ఎవరైనా పర్యాటకులు కూడా మట్టి శిథిలాల కింద చిక్కుకున్నారా అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు.





Total views : 192545