ప్రముఖ మెసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సాప్ తీసుకురావాలనుకున్న యూజర్ నేమ్ ఫీచర్ పై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వివాదాస్పద ఫీచర్ పై స్పందించేందుకు వాట్సప్ మాతృసంస్థ మెటాకు మరో మూడురోజులు గడువిచ్చింది కేంద్రం. అయితే..ఈ ఫీచర్ పై ప్రభుత్వంతో చర్చలు పూర్తిగా ముగిసేంతవరకూ భారత్లోకి అందుబాటులోకి తీసుకురాబోమని మెటా ప్రతినిధులు స్పష్టం చేశారు.
ప్రస్తుతం వాట్సాప్లో ఒకరితో ఒకరు చాట్ చేయాలంటే ఫోన్ నంబర్ తప్పనిసరి. అయితే వాట్సప్..ఈ ఫోన్ నంబర్ అవసరం లేకుండా యూజర్ నేమ్ ద్వారా చాట్ చేసేలా కొత్త ఫీచర్ ను డిజైన్ చేసింది. ఐతే దీనివల్ల ఆన్లైన్ మోసాలు, ఫిషింగ్, డిజిటల్ అరెస్ట్ స్కాములు, ఒకరిపేరుతో మరొకరు చలామణి అయ్యే ముప్పు విపరీతంగా పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. నిబంధనలు ఉల్లంఘిస్తే ఐటీ చట్టం కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని కేంద్రం మెటాకు నోటీసులు జారీ చేసింది.
దీనిపై వివరణ ఇచ్చిన వాట్సాప్..సైబర్ నేరాలను అడ్డుకునేందుకు బలమైన భద్రతా వలయాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపింది. సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ సంస్థల పేర్లతో నకిలీ ఐడీలు క్రియేట్ చేయకుండా..ఆయా పేర్లను ముందే హోల్డ్ లో ఉంచినట్లు తెలిపారు. అలాగే ఇందులో లిమిటెడ్ సెర్చ్ ఉంటుందని, ఒకరి యూజర్ నేమ్ పూర్తిగా తెలిస్తేనే మెసేజ్ చేయగలరని, ఊహాజనితంగా పేర్లను టైప్ చేసి వెతికే ప్రయత్నాలను సిస్టమ్ బ్లాక్ చేస్తుందని తెలిపింది. ఎవరైనా కొత్త వ్యక్తి యూజర్నేమ్ ద్వారా మొదటిసారి మెసేజ్ చేస్తే.. ఆ అకౌంట్ ఎప్పుడు క్రియేట్ అయింది? వారు ఏ దేశానికి చెందినవారు? మనతో ఏవైనా మ్యూచువల్ గ్రూప్స్ ఉన్నాయా? అనే వివరాలను వాట్సాప్ యూజర్కు చూపిస్తుందని వివరించింది.
ఇదిలా ఉంటే..కేవలం వాట్సాప్ మాత్రమే కాదు..ఇప్పటికే యూజర్నేమ్ ఫీచర్ను రన్ చేస్తున్న టెలిగ్రామ్, సిగ్నల్ యాప్లకు కూడా కేంద్రం నోటీసులు పంపింది. ఈ ఫీచర్ల ద్వారా జరుగుతున్న మోసాలను, నకిలీ అకౌంట్లను ఎలా అరికడుతున్నారో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దీంతో పాటు, పైరసీ కంటెంట్ను వ్యాప్తి చేస్తున్నందుకు టెలిగ్రామ్కు, ఇన్స్టాగ్రామ్ యాడ్స్లో చైల్డ్ అబ్యూస్ మెటీరియల్పై మెటాకు కేంద్రం తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేసింది.






Total views : 192880