విద్య వ్యాపారంగా మారింది. పిల్లల చదువులను పెట్టుబడిగా చేసుకుని కోట్లు సంపాదిస్తున్నాయి విద్యాసంస్థలు. ఇంటర్నేషనల్, గ్లోబల్ అని బోర్డులు తగిలించుకుని… తల్లిదండ్రులను నిలువుదోపిడీ చేస్తున్నాయి. ఉప్పల్ పీర్జాదీగూడలోని ఆర్కా గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్ సంగతి సరిగ్గా ఇదే. పేరుకు ఇంటర్నేషనల్ స్కూలే అయినా విద్యార్థుల భద్రత మాత్రం ప్రశ్నార్థకమే. అసలు స్కూల్ ఎంట్రన్స్లోనే హై టెన్షన్ వైర్లు.. యమపాశాల్లా వేలాడుతూ కనిపిస్తాయి. పాఠశాల భవనం వెనక వైపు కూడా ఇదే పరిస్థితి. ఎప్పుడు చిన్నపాటి ప్రమాదం జరిగినా పరిస్థితి ఏంటన్నది తలచుకుంటేనే ఆందోళన కలుగుతుంది. దీని గురించి యాజమాన్యాన్ని అడిగితే సమాధానం ఉండదు. రోజూ అక్కడ విధులు నిర్వహించే సెక్యూరిటీ సిబ్బంది దీనిపై ఎలా స్పందిస్తున్నారో చూడండి..
మరోవైపు అధిక ఫీజులతో తల్లిదండ్రులపై కొండంత భారం పడుతోంది. అడ్మిషన్లు, డొనేషన్లు, ట్రాన్స్పోర్ట్ పేరుతో నిలువు దోపిడీ చేస్తున్నారు. పదో తరగతి చదివే పిల్లల ఫీజు అన్ని ఖర్చులు కలిసి రెండున్నర లక్షలు దాటుతోంది. అంటే నెలకు ఒక విద్యార్థికి దాదాపు 20 వేలన్న మాట. ఈ అమౌంట్ చూస్తేనే సామాన్యుల గుండె గుభేల్ మంటుంది. పోనీ అంత డబ్బు తీసుకుని చదువు ఏమైనా నాణ్యంగా ఉంటుందా అంటే అదీ లేదు. ఎంతసేపు ప్రచార యావ తప్ప.. పిల్లల చదువులపై శ్రద్ధే లేదన్న విమర్శలు జోరుగా ఉన్నాయి. అసలు ఇందులో చదువులు చెప్పే టీచర్లకే సరైన క్వాలిఫికేషన్ లేదన్న ఆరోపణలున్నాయి. విద్యాహక్కు చట్టం ప్రకారం కనీసం 25 శాతం సీట్లను పేద పిల్లలకు కేటాయించాలి. కానీ అలాంటిదేమీ ఆర్కా గ్లోబల్ స్కూల్లో ఉండదు. పైపై హంగులే తప్ప లోపలంతా డొల్లే అని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి….





Total views : 75060