అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్, ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. రైతు సంక్షేమమే ధ్యేయంగా, పంట పెట్టుబడి ఖర్చుకు అదనంగా మరో 50 శాతం లాభం కలిపి ఈ కొత్త ధరలను ఖరారు చేసింది. ఇందుకోసం ప్రభుత్వం ఏకంగా 2.6 లక్షల కోట్ల రూపాయలను వెచ్చించనుంది. ఈ కొత్త సవరణ ప్రకారం.. సాధారణ వరి రకానికి మద్దతు ధర క్వింటాల్కు 2,441 రూపాయలకు చేరగా, నాణ్యమైన గ్రేడ్-ఏ వరి ధర 2,461 రూపాయలుగా ఖరారైంది. వాణిజ్య పంటల్లో పత్తిపై 557 రూపాయలు పెంచి 8,267 రూపాయలకు, పొద్దుతిరుగుడుపై 622 రూపాయలు పెంచి 8,343 రూపాయలకు ధరను పెంచింది. అలాగే రికార్డు స్థాయిలో నువ్వుల ధరను 10 వేల 52 రూపాయలుగా నిర్ణయించినట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైణ్ణవ్ తెలిపారు.
సజ్జలు 2,900 రూపాయలు, రాగులు 5,205 రూపాయలు, మక్కజొన్న 2,410 రూపాయలుగా కేంద్రం మద్ధతు ధరలు ప్రకటించింది. పప్పుధాన్యాల సాగును ప్రోత్సహిస్తూ.. కందులకు 8,450 రూపాయలు, పెసర్లకు 8,780 రూపాయలు, మినుములకు 7,800 రూపాయల మద్దతు ధరను ఖరారు చేసింది. ఇక పల్లీల ధర క్వింటాల్కు 7,263 రూపాయలుగా ఉండనుంది. 2014 నుంచి 2026 మధ్య కాలంలో రైతులకు యూపీఏ హయాం కంటే నాలుగు రెట్లు అధికంగా చెల్లింపులు జరిపినట్లు కేంద్రమంత్రి తెలిపారు. ఏడాదికి సుమారు 824 మిలియన్ టన్నుల పంటను సేకరిస్తూ, అన్నదాతల ఆదాయం పెంచడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామన్నారు. పలు పంటలకు మద్ధతు ధరలు పెంచడంతో దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతులకు భారీ లబ్ధి చేకూరుతుందని అశ్వనీ వైష్ణవి తెలిపారు.




Total views : 75956