Friday, September 11, 2026
News Navigation
Friday, September 11, 2026
News Navigation

Breaking

Friday, September 11, 2026
Home Andhra Pradesh కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు భేటీ.

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు భేటీ.

by CVR NEWS
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు భేటీ

ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యలు, ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆయన వినతులు సమర్పించారు. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు… కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ఆక్వా, పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని పరిష్కరించాలని, రాయలసీమ సమగ్రాభివృద్ధికి ఉద్దేశించిన హార్టికల్చర్ హబ్‌కు సహకరించాలని సీఎం కోరారు.

ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని, తక్షణం కేంద్రం విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు. రొయ్యల మేత తయారీకి ఉపయోగించే ముడి సరుకుల ధరలు విపరీతంగా పెరగడం వల్ల ఉత్పత్తి వ్యయం 20 శాతానికి పైగా పెరిగిందని వివరించారు. ఫిష్ మీల్ టన్ను రూ.1.55 లక్షల నుంచి రూ.2.40 లక్షలకు, చేప నూనె టన్ను రూ.2.80 లక్షల నుంచి రూ.4.40 లక్షలకు పెరిగిందని గణాంకాలతో సహా వివరించారు. ఈ భారం టన్నుకు రూ.25 వేల వరకు పెరిగిందన్నారు.

అదే సమయంలో, భారత్ నుంచి ఎగుమతి అయ్యే రొయ్యలపై అమెరికా 5.77 శాతం కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ విధించిందని, యాంటీ డంపింగ్ డ్యూటీ వేసే ఆలోచనలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ రొయ్యల ఎగుమతుల్లో 80 శాతం ఏపీ నుంచే జరుగుతున్నాయని, ఈ సుంకాల వల్ల రాష్ట్రంలోని 30 లక్షల మంది జీవనోపాధి దెబ్బతింటుందని తెలిపారు. ఈ విషయంలో కేంద్రం అమెరికాతో సంప్రదింపులు జరపాలని, రూ.100 కోట్ల కార్పస్ ఫండ్‌తో ‘ఆంధ్రప్రదేశ్ ప్రాన్ ప్రొడ్యూసర్స్ కోఆర్డినేషన్ కమిటీ’ ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

జీఎస్టీలో పొగాకు ఉత్పత్తులను అత్యధిక పన్ను శ్లాబులో చేర్చడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీని కారణంగా తయారీదారులు కొనుగోళ్లు తగ్గించడంతో వేలం ప్రక్రియ నెమ్మదించిందన్నారు. ఈ ఏడాది 230 మిలియన్ కేజీల ఉత్పత్తికి గాను కేవలం 34 మిలియన్ కేజీలు మాత్రమే కొనుగోలు చేశారని, ఇది రైతులు, కార్మికులు, రవాణా రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని వివరించారు. ఈ సమస్యను పరిష్కరించి పొగాకు రైతులను ఆదుకోవాలని కోరారు.

రాయలసీమను దేశంలోనే అగ్రగామి ఉద్యానవన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రూపొందించిన ‘రాయలసీమ ఇంటిగ్రేటెడ్ హార్టీకల్చర్ డెవలప్‌మెంట్ ప్లాన్’కు పూర్తి సహకారం అందించాలని చంద్రబాబు కోరారు. ఈ ప్రణాళిక ద్వారా రూ.40 వేల కోట్ల ప్రభుత్వ, రూ.60 వేల కోట్ల ప్రైవేటు పెట్టుబడులతో ఏటా రూ.81 వేల కోట్ల స్థూల విలువ జోడింపు (GVA), 19.7 లక్షల ఉద్యోగాలు సృష్టించవచ్చని వివరించారు. ఆగస్టు 6-7 తేదీల్లో ఈ ప్రాజెక్టు పనుల ప్రారంభోత్సవానికి హాజరు కావాలని నిర్మలా సీతారామన్‌ను ఆహ్వానించారు.

ఈ హార్టికల్చర్ హబ్ ప్రణాళికలో భాగంగా, రిలయన్స్ సంస్థ భాగస్వామ్యంతో ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్’ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం తెలిపారు. వ్యవసాయంలో ఏఐ, డిజిటల్ టెక్నాలజీ, వాతావరణ సుస్థిరత వంటి అంశాలపై పరిశోధనలు ప్రోత్సహించేలా ఇది గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా పనిచేస్తుందన్నారు. ఈ ప్రతిష్ఠాత్మక సంస్థ ఏర్పాటుకు కేంద్రం తోడ్పాటు అందించాలని కోరారు. రాష్ట్ర తక్షణ అవసరాలతో పాటు, దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికలకు కేంద్ర సహకారం కోరడమే లక్ష్యంగా ఈ భేటీ సాగింది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: