సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు, రేపు కలెక్టర్ల సదస్సు జరగనుంది. గతంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సుల్లో తీసుకున్న నిర్ణయాల అమలు, వాటిపై చేపట్టిన చర్యలు, పురోగతికి సంబంధించిన నివేదికలపై సీఎం సమీక్షించనున్నారు. జిల్లాల్లో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై అధికారులతో చర్చించనున్నారు. తొలి రోజు రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, GSDP, స్వర్ణాంధ్ర విజన్, సూపర్ సిక్స్ హామీల అమలు వంటి అంశాలపై ప్రధానంగా చర్చ జరగనుంది.
తాగునీటి సరఫరా, గృహ నిర్మాణం, విద్య, వైద్యం వంటి రంగాల్లో జిల్లా వారీగా పురోగతిని అధికారులు సీఎంకు వివరించనున్నారు. ప్రభుత్వ పథకాల అమలులో ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. జిల్లాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయడంతో పాటు.. ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత సమర్థంగా అందేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్లకు సూచనలు చేయనున్నారు.
రెండో రోజు ఇ-గవర్నెన్స్, ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ల పరిష్కారం, RTGS తదితర అంశాలపై సమీక్ష నిర్వహించనున్నారు. ప్రజా సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారంలో అధికారుల పనితీరును కూడా చంద్రబాబు పరిశీలించనున్నారు. శాంతిభద్రతల పరిస్థితిపై జిల్లాల వారీగా సమీక్షించి.. పోలీసు, పరిపాలనా యంత్రాంగం సమన్వయంతో పనిచేసేలా కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు.