తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, ఈ విజయాన్ని ఏ శక్తీ ఆపలేదని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే బీజేపీ అధిష్ఠానం దృష్టి పూర్తిగా తెలంగాణపైనే ఉంటుందని, రాష్ట్రంలో అధికారంలోకి రావడమే తదుపరి లక్ష్యమని చెప్పారు. భద్రాచలంలో నిర్వహించిన బీజేపీ కార్యకర్తలు, నాయకుల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఈ వ్యాఖ్యలు చేశారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఓ కాంగ్రెస్ మంత్రి ఢిల్లీకి అక్రమ మార్గాల్లో మూటలు పంపుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. గతంలో కేసీఆర్ పాలనలోనూ అదే మంత్రి బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధించారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయంతో అందిస్తున్న ఉచిత సన్నబియ్యం, ఇళ్ల పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం తమ సొంత పథకాలుగా ప్రచారం చేసుకుంటూ ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు.
గతంలో రజాకార్ల పాలనను తలపించిన కేసీఆర్ ప్రభుత్వ మెడలు వంచింది బీజేపీయేనని బండి సంజయ్ పేర్కొన్నారు. తనపై 109 అక్రమ కేసులు నమోదైనా తాను ఎప్పుడూ వెనకడుగు వేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై కార్యకర్తలు సైనికుల్లా పోరాడాలని, పోలీసు కేసులకు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్ ప్రస్తుతం నాలుగు రాష్ట్రాలకే పరిమితమైందని, తెలంగాణలోనూ ఆ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని వ్యాఖ్యానించారు.