సంక్షేమం గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదని రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమలు, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమన్నారు. ఎన్నికల హామీ మేరకు సీఎం చంద్రబాబు పెన్షన్ను రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచి మాట నిలబెట్టుకున్నారని తెలిపారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు.
గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో పెన్షన్ను ఏటా రూ.250 చొప్పున మాత్రమే పెంచిందని మంత్రి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే హామీ మేరకు పెన్షన్ పెంచి, ఏప్రిల్ నుంచి బకాయిలతో సహా లబ్ధిదారులకు అందించిందన్నారు. 26 నెలల్లోనే రూ.73 వేల కోట్లను నేరుగా లబ్ధిదారుల చేతిలో పెట్టామని చెప్పారు. 6 లక్షల పెన్షన్లు తొలగించామన్న మాజీ మంత్రి బూడి ముత్యాల నాయుడు ఆరోపణలను ఖండిస్తూ.. ప్రభుత్వం ఏర్పడే నాటికి 65 లక్షల పెన్షన్లు ఉండగా, ప్రస్తుతం 62.10 లక్షల మందికి అందుతున్నాయని వివరించారు. సహజ మరణాల కారణంగానే సంఖ్య తగ్గిందని, ప్రభుత్వం తొలగించినవి కేవలం 3 వేలేనన్నారు.
పెన్షన్ల వ్యవస్థలో కూటమి ప్రభుత్వం అనేక మార్పులు తీసుకొచ్చిందని కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. మూడు నెలల పెన్షన్ను ఒకేసారి తీసుకునే వెసులుబాటు కల్పించామని, పెన్షనర్ మరణిస్తే వెంటనే జీవిత భాగస్వామికి స్పౌస్ పెన్షన్ అందేలా చర్యలు చేపట్టామన్నారు. దివ్యాంగుల పెన్షన్ను రూ.6 వేలకు, డయాలసిస్ బాధితుల పెన్షన్ను రూ.10 వేలకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పెన్షన్ను రూ.15 వేలకు పెంచామని చెప్పారు. అర్హుల నుంచి కొత్త దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించగా రెండు రోజుల్లోనే 2.30 లక్షల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. సంక్షేమంతో పాటు అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, వైసీపీ చేస్తున్న విషప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని మంత్రి కోరారు.