తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు అరెస్టు జరిగి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిరసన తెలిపారు. ‘నిజం గెలిచింది’ అనే నినాదంతో ఉండవల్లిలోని తన నివాసంలో 53 కొవ్వొత్తులు వెలిగించి నాటి ఘటనను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
మూడేళ్ల క్రితం ఇదే రోజున నాటి సీఎం జగన్ రాజకీయ దురుద్దేశంతో, కుట్రపూరితంగా తప్పుడు కేసు బనాయించి చంద్రబాబును అర్ధరాత్రి అరెస్టు చేయించారని లోకేశ్ ఆరోపించారు. ఆ కేసులో చంద్రబాబును 53 రోజుల పాటు అక్రమంగా జైలులో నిర్బంధించారని పేర్కొన్నారు. ఆ చీకటి రోజులకు గుర్తుగా, నాటి నిర్బంధాన్ని నిరసిస్తూ 53 కొవ్వొత్తులు వెలిగించినట్లు తెలిపారు.
చంద్రబాబు అరెస్టు జరిగిన రోజు ప్రజాస్వామ్యానికే చీకటి రోజని లోకేశ్ వ్యాఖ్యానించారు. అయితే చివరికి నిజమే గెలిచిందని అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావడమే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు.
చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు.. లోకేశ్ నిరసన.
10