పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో తాగునీటి సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోంది. జిల్లా కేంద్రంగా ఏర్పడి నాలుగేళ్లు పూర్తయినా ప్రజలకు మాత్రం ఇంకా కనీస స్థాయిలో కూడా స్వచ్ఛమైన తాగునీరు అందడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేరు మాత్రం గ్రేడ్-1 మున్సిపాలిటీ అయినప్పటికీ పరిస్థితులు మాత్రం గ్రామాలను తలపిస్తున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణంలోని అనేక కాలనీల్లో ఐదు రోజులకోసారి మాత్రమే నీటి సరఫరా జరుగుతోందని ప్రజలు చెబుతున్నారు. అదీ సరైన ఒత్తిడితో కాకుండా చిన్న చిన్న దారల రూపంలో రావడంతో నీటిని సేకరించడం పెద్ద సమస్యగా మారింది. వచ్చిన నీటిలో బురద, మలినాలు కలిసివస్తుండటంతో తాగడానికి, వంటకు కూడా ఉపయోగించలేని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా మహిళలు గంటల తరబడి నీటి కోసం వేచి ఉండాల్సి వస్తోందని వాపోతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగడంతో చాలామంది ప్రైవేట్ వాటర్ క్యాన్లపై ఆధారపడుతున్నారు. తాగునీటి సమస్యపై అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
పార్వతీపురం పట్టణ ప్రజల తాగునీటి కష్టాలు ఏళ్లుగా కొనసాగుతున్నా సమస్యకు మాత్రం శాశ్వత పరిష్కారం కనిపించడం లేదు. గత 12 ఏళ్లలో ప్రభుత్వాలు మారాయి, అధికారులు మారారు, ప్రజాప్రతినిధులు మారారు… కానీ ప్రజల దాహార్తి మాత్రం తీరలేదని స్థానికులు మండిపడుతున్నారు. ప్రస్తుతం పట్టణంలోని దాదాపు 60 శాతం మంది ప్రజలు మున్సిపాలిటీ కోళాయిలపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అయితే సరైన నీటి సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేసవి కాలం కావడంతో సమస్య మరింత తీవ్రమైందని ప్రజలు చెబుతున్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు నీటి కోసం ఇళ్ల నుంచి బయటకు వెళ్లి గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మలినాలు కలిసిన నీటిని వినియోగించాల్సి రావడంతో అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని ప్రజలు భయపడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి పట్టణానికి నిరంతర స్వచ్ఛమైన తాగునీటి సరఫరా అందించాలని, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.






Total views : 89056