అధిక జ్యేష్ఠమాస పౌర్ణమి సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై గిరి ప్రదక్షిణ వైభవంగా నిర్వహించారు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారి కృపను పొందారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాలు, భజనల నడుమ గిరి ప్రదక్షిణ భక్తిశ్రద్ధలతో సాగింది. ఘాట్ రోడ్డు ప్రవేశ ద్వారం వద్ద ఉన్న శ్రీ కామధేను అమ్మవారి సన్నిధి నుంచి గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. ఆలయ కార్యనిర్వహణాధికారి వి.కె. శీనానాయక్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేవస్థానం స్థానాచార్యులు, అర్చకులు వేదోక్త పూజలు నిర్వహించారు.దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంప్రదాయ తప్పెట్లు, కోలాట నృత్యాలు, భజన సంకీర్తనలు, మంగళవాయిద్యాలు, వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ గిరి ప్రదక్షిణ వైభవంగా సాగింది. భక్తులకు కుంకుమ, ప్రసాదాలను దేవస్థానం పంపిణీ చేసింది.వేలాది మంది భక్తులు పాల్గొని గిరి ప్రదక్షిణ నిర్వహించడంతో ఇంద్రకీలాద్రి పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.





Total views : 90065