పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రమవుతోన్న నేపథ్యంలో.. అమెరికా- ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వానికి రష్యా ముందుకొచ్చింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీతో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఫోన్లో మాట్లాడారు. ఈ క్రమంలో ఉద్రిక్తతలు మళ్లీ పెరగకుండా నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలని లావ్రోవ్ పిలుపునిచ్చారు. ఈమేరకు రష్యా విదేశాంగశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
సాయుధ ఘర్షణలు పునరావృతం కాకుండా చూసుకోవాలని లావ్రోవ్ పిలుపునిచ్చారు. సంక్షోభాన్ని పరిష్కరించడంలో చేతనైనంత సాయం చేసేందుకు రష్యా సిద్ధంగా ఉందని పునరుద్ఘాటించారు. ఇరాన్, దాని పొరుగుదేశాల చట్టబద్ధమైన ప్రయోజనాలను గౌరవిస్తామన్నారు. ఈ సంఘర్షణను ముగించేందుకు, పశ్చిమాసియాలో దీర్ఘకాల శాంతి కోసం చేస్తున్న దౌత్య ప్రయత్నాలను మాస్కో స్వాగతిస్తుందన్నారు. ఈ సందర్భంగా ఇస్లామాబాద్లో ఇటీవల అమెరికాతో జరిగిన శాంతి చర్చలకు సంబంధించిన వివరాలను అరాగ్చీ లావ్రోవ్కు వివరించారని రష్యా విదేశాంగశాఖ తెలిపింది.
అణ్వస్త్రాన్ని వీడేందుకు ఇరాన్ నిరాకరించడంతో అమెరికాతో జరిగిన శాంతిచర్చలు విఫలమయ్యాయి. ఈక్రమంలో ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం ను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని రష్యా పునరుద్ఘాటించింది. అమెరికాతో భవిష్యత్తులో కుదిరే శాంతిఒప్పందంలో భాగంగా ఈ చర్యకు సిద్ధమైనట్లు క్రెమ్లిన్ పేర్కొంది. ‘అమెరికా, ప్రాంతీయ నాయకులతో జరిపిన చర్చల్లో అధ్యక్షుడు పుతిన్ ఈ ప్రతిపాదన చేశారు. ఈ ప్రతిపాదన ఇప్పటికీ అలాగే ఉంది. కానీ, దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు’ అని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా హర్మూజ్ జలసంధిని దిగ్బంధిస్తామంటూ ట్రంప్ బెదిరింపులకు పాల్పడటాన్ని తప్పుబట్టారు.





Total views : 81433