ఉమ్మడి అనంతపురం అంటేనే కరువు జిల్లా. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటే తప్ప అక్కడ తగినంత నీరు దొరకని పరిస్థితి. అలాంటి ఉన్న సహజ వనరులను ధ్వంసం చేస్తున్నారు కొందరు దుర్మార్గులు. వారికి అధికారంలో ఉన్న కొందరు పెద్దలు వంత పాడుతున్నారు. సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తిలో ఇసుకాసురుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. చిత్రావతి నదిలో అక్రమంగా ఇసుకను తవ్వే స్తున్నారు. పుట్టపర్తి సమీపంలోని ఎనుములపల్లి, రాయలవారిపల్లె ప్రాంతాల్లోని చిత్రావతి నదిలో అక్రమార్కులు ఇష్టారాజ్యంగా ఇసుకను తరలిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన కొందరు స్థానిక నాయకులు ఇసుకను తవ్వి అక్రమంగా తరలిస్తూ లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. పెద్ద ఎత్తున JCB లతో తవ్వి… లారీలు ట్రాక్టర్లతో ఇసుక తరలించి పెద్ద ఎత్తున లాభాలు గడిస్తున్నారు. ఇంత జరుగుతున్నా రెవిన్యూ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఈ దందాలో రెవెన్యూ, మైనింగ్ అధికారులకు కూడా మామూళ్లు అందుతున్నాయని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చిత్రావతిలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలపై ఇరిగేషన్ అధికారులను ప్రశ్నించగా తమకు తెలియకుండానే ఇదంతా జరుగుతోందని చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది..
మరోవైపు.. చిత్రావతికి జరుగుతున్న చిత్రవధపై పుట్టపర్తి వాసులు, ప్రజాసంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ప్రాంతానికి ప్రధాన నీటి వనరుగా ఉన్న చిత్రావతి నది.. ఇసుక తవ్వకాల కారణంగా రూపురేఖలు కోల్పోతోందని చెబుతున్నారు. నదిలో ఇసుక లేకపోతే భూమిలోకి నీరు సరిగా ఇంకదని.. దీనివల్ల భూగర్భ జలాలు అంతరించిపోతాయని అంటున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరిస్తున్నారు…
మరోవైపు చిత్రావతిలో జరుగుతున్న ఇసుక దందా వెనుక అధికార పార్టీ నేతల హస్తం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేకు దగ్గరివారే ఇసుక తరలింపునకు సూత్రధారులు అని స్థానికులు చెప్పుకుంటున్నారు. అయితే చాలా కాలంగా ఈ ఆరోపణలు వినిపిస్తున్నా.. స్థానిక ఎమ్మెల్యే సింధూర రెడ్డి ఇప్పటి వరకు దీనిపై స్పందించకపోవడం విశేషం. చిత్రావతిలో జరుగుతున్న ఇసుక దందాకు సంబంధించిన పూర్తి వివరాలు మా అనంతపురం ప్రతినిధి త్రిలోక్ అందిస్తారు..





Total views : 75982