అన్నదాతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటుంటే.. కల్లాల్లో రైతుల కన్నీళ్లు ఉప్పొంగుతున్నాయి. పంటలు పండించిన పాపానికి..అమ్ముకోలేక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి నెల రోజులు గడుస్తున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం మారలేదు. సీఎం రేవంత్రెడ్డి కలెక్టర్లతో సమావేశం ఏర్పాటుచేసి ఆదేశాలు జారీ చేసినా కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో దాదాపుగా ఇదే పరిస్థితి ఉంది. ఎక్కడా కూడా రైతుకు సంతృప్తికర పరిస్థితులు లేవు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల పరిస్థితిపై మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం…
నల్గొండ జిల్లా వరప్రదాయిని అయిన నాగార్జున సాగర్ ప్రాంతానికి వెళ్తే అక్కడ సాగునీరు సమృద్ధిగా ఉంది.. పంటలు అద్భుతంగా పండాయి. కానీ, ఆ అన్నదాతల కళ్లల్లో మాత్రం ఆనందం లేదు. పంట చేతికొచ్చి రెండు నెలలవుతున్నా..కొనుగోళ్లు జరగక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకవేళ అరకొరగా కొన్నా… తాలు పేరిట అధికారులు తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని రైతులు వాపోతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో గన్నీ సంచులు లేవు. ఎప్పుడు వర్షం పడి ధాన్యం నీట కొట్టుకుపోతుందో తెలియక అన్నదాత ఆవేదన పడుతున్నారు. ప్రాణాలన్నీ అరచేతిలో పెట్టుకుని… పంటను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు.
ఇక ఇటు చౌటుప్పల్ ప్రాంతంలోనూ పరిస్థితులు ఇలాగే ఉన్నాయి. వడ్ల కొనుగోలుకు ఎలాగూ అధికారులు ఏర్పాట్లు చేయరు. కనీసం వాటి కాపలాకు తమకు రైతులకు మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేయలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా లేవని వాపోతున్నారు. ప్రభుత్వం క్వింటాకు అదనంగా 300 రూపాయలిస్తే… ఖర్చుల రూపంలోనే ఐదు వందలు ఎగిరిపోతున్నాయని.. అన్నదాతలు మండిపడుతున్నారు. కనీసం వడ్లను ఎత్తిపెట్టడానికి సరిపడా గన్నీ బ్యాగులు కూడా లేవని చౌటుప్పల్ ప్రాంత రైతులు నిప్పులు చెరుగుతున్నారు…
మరోవైపు మిర్యాలగూడెం ప్రాంత రైతులకు మరో రకమైన సమస్య ఎదురవుతోంది. మిగతా ప్రాంతాలతో పోల్చితే ఇక్కడ ధాన్యం కొనుగోళ్లు కొంత వేగంగా జరుగుతున్నప్పటికీ… తూకం వేసిన ధాన్యాన్ని తరలించడానికి లారీలు రావడం లేదు. దీంతో విసిగిపోయిన రైతన్నలు రోడ్లెక్కి నిరసనలు తెలిపారు. వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న సీఎం రేవంత్రెడ్డి..కలెక్టర్లతో సమావేశం ఏర్పాటుచేసి యుద్ధప్రాతిపదికన కొనుగోళ్లు జరపాలని ఆదేశించారు. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే పరిస్థితిలో ఏమంత మార్పు వచ్చినట్లు కనిపించడం లేదు. తాలు కింద క్వింటాకు 2 కిలోలకు పైగానే కోత పెడుతున్నారని.. ప్రభుత్వం మరింత చొరవ చూపితే తప్ప వ్యవస్థ బాగుపడదని రైతులు అంటున్నారు..
అటు తిరుమలగిరి ప్రాంతంలో ఒకవైపు కొనుగోళ్లు జరుగుతున్నాయని అధికారులు చెబుతుంటే.. రైతుల గోస మాత్రం వర్ణనాతీతంగా మారింది. అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ తమకు ఇష్టం వచ్చిన వారికి ముందు కాంటా వేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకే సీరియల్ నంబర్ మీద 10 మంది దగ్గర ధాన్యం కొంటున్నారని చెబుతున్నారు. కేంద్రాల్లో సరిపడా గన్నీ బ్యాగులు లేకపోవడంతో.. రైతులు ధాన్యం కుప్పల ముందే రాత్రింబవళ్లు కాపలా కాస్తున్నారు. వర్షం వస్తే సర్వస్వం కోల్పోతామనే భయంతో.. వేరే దారి లేక, అప్పులు చేసి మరీ సొంత డబ్బులతో మార్కెట్లో గన్నీ సంచులు కొనుక్కుంటున్నారు. అటు కాంట్రాక్టర్ల పట్టింపులేనితనం, అధికారుల సమన్వయ లోపంతో లారీల కొరత అలాగే వేధిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సూర్యాపేట ప్రాంతంలోనూ ఇంచుమించుగా ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. కొనుగోలు కేంద్రాల వద్ద నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితులపై రైతాంగం తీవ్ర ఆగ్రహజ్వాలలు వ్యక్తంచేస్తోంది. వడ్లు తీసుకొచ్చి 45 రోజులు గడుస్తున్నా కొనుగోళ్లు ఇంకా వేగంగా జరగడం లేదని మండిపడుతున్నారు. ఓ వైపు వర్షాలు వస్తాయన్న సూచనలుంటే.. ఇంకోవైపు అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని వాపోతున్నారు. ముందు జాగ్రత్తగా ధాన్యాన్ని మరో ఐకేపీ సెంటర్కు తీసుకెళ్లాలంటే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని అంటున్నారు. లారీలు, గన్నీ బ్యాగుల కొరత చాలా తీవ్రంగా ఉందని.. వాటిని ముందుగా సమకూర్చాలని కోరుతున్నారు.
మొత్తం మీద పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా ఉంది నల్గొండ జిల్లాలో ధాన్యం రైతుల పరిస్థితి. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం కాగితపు సమీక్షలు పక్కన పెట్టి.. యుద్ధప్రాతిపదికన లారీలను సమకూర్చి, కళ్ళాల్లో ఉన్న ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని నల్గొండ జిల్లా అన్నదాతలు చేతులు జోడించి వేడుకుంటున్నారు….
నీళ్లు పుష్కలంగా ఉండి పంటలైతే బ్రహ్మాండంగా పండాయి.. కానీ కొనుగోళ్లు జరగక ఆ పంటంతా ఇప్పుడు కల్లాలు, ఐకేపీ కేంద్రాల్లోనే ఉండాల్సిన పరిస్థితి. ఏది ఏమైనా.. ఆరుగాలం శ్రమించి దేశానికి అన్నం పెట్టే రైతన్న..ఇవాళ రోడ్డున పడి కన్నీరు కార్చుతున్నాడు. సీఎం ఆదేశాలు జారీ చేసినా క్షేత్రస్థాయిలో యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందనడానికి నల్గొండ జిల్లాలోని కొనుగోలు కేంద్రాలే సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు సమీక్షల నుంచి బయటకు వచ్చి.. యుద్ధప్రాతిపదికన గన్నీ సంచులు, లారీలను సమకూర్చాలి. అకాల వర్షాల ముప్పు నుండి ధాన్యాన్ని కాపాడి, వెంటనే కొనుగోళ్లు పూర్తి చేయాలని అన్నదాతలు కోరుతున్నారు.





Total views : 80399