అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తమ వైఖరిని కఠినతరం చేశారు. అమెరికా, ఇజ్రాయెల్లతో కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం సందిగ్ధంలో ఉన్న తరుణంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. వ్యూహాత్మకంగా కీలకమైన హార్ముజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణను కొత్త దశకు తీసుకెళ్తామని ఖమేనీ ప్రకటించారు. ప్రపంచ చమురు సరఫరాలో ఈ జలసంధి అత్యంత ప్రధానమైన మార్గం కావడంతో, ఇరాన్ పట్టు పెంచితే ఇంధన ధరలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. యుద్ధం వల్ల జరిగిన ప్రాణ, ఆస్తి నష్టాలకు గానూ అమెరికా, ఇజ్రాయెల్ నుంచి నష్టపరిహారాన్ని ఖచ్చితంగా వసూలు చేస్తామని ఖమేని స్పష్టం చేశారు. దురాక్రమణదారులను ఊరికే వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ప్రస్తుత పశ్చిమాసియా సంక్షోభంలో ఇరాన్ ప్రజలే అంతిమ విజేతలుగా నిలిచారని ఆయన అభివర్ణించారు. శాంతిని కోరుకుంటున్నప్పటికీ, తమ ప్రాథమిక హక్కులను వదులుకోబోమని తేల్చి చెప్పారు. చర్చల సమయంలో అమెరికాపై ఒత్తిడి పెంచేందుకు ప్రజలు నిరంతరం నిరసనలు తెలుపుతూ హ్యూమన్ డిఫెన్స్ చెయిన్స్ గా ఏర్పడాలని మొజ్తబా ఖమేని పిలుపునిచ్చారు.
Tag: