తమిళనాడులోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వం శుభవార్త అందించింది. వారి కరవు భత్యాన్ని (డీఏ) 2 శాతం పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో డీఏ 58 శాతం నుంచి 60 శాతానికి పెరిగింది. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 16 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు డీఏను 58 శాతం నుంచి 60 శాతానికి పెంచిన నేపథ్యంలో, అదే ప్రయోజనాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వర్తింపజేస్తున్నట్లు ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. ఈ పెంపు 2026 జనవరి 1 నుంచే వర్తిస్తుందని స్పష్టం చేసింది.
ఈ డీఏ పెంపు వల్ల రాష్ట్ర ఖజానాపై ఏటా సుమారు రూ.1,230 కోట్ల అదనపు భారం పడనుందని అధికారులు అంచనా వేశారు. అయినప్పటికీ, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ప్రజా సంక్షేమ పథకాల అమలులో ఉద్యోగుల పాత్ర కీలకమని ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ సందర్భంగా గుర్తు చేసింది.
ప్రభుత్వ తాజా నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ల సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, జీవన వ్యయాల నుంచి ఇది కొంత ఉపశమనం కలిగిస్తుందని వారు అభిప్రాయపడ్డారు. పెంచిన డీఏ, బకాయిల చెల్లింపునకు సంబంధించి ప్రభుత్వం త్వరలో పూర్తిస్థాయి ఉత్తర్వులు జారీ చేయనుంది.





Total views : 76734