ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన భారత మండపంలో ఎన్డీఏ నేతలు సమావేశమయ్యారు. నరేంద్ర మోదీ ప్రభుత్వానికి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సమావేశం జరుపుతున్నారు. అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన రికార్డును సొంతం చేసుకున్న మోదీని ఎన్డీఏ నేతలు సత్కరించారు. మోదీని అభినందిస్తూ ఎన్డీఏ తీర్మానం చేసింది. ఈ సమావేశంలో పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. ఎన్డీఏలోని కీలక నేతలు భారత్ మండపానికి చేరుకుని సమావేశంలో పాల్గొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ హాజరయ్యారు. అలాగే, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి, బిహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌధరి కూడా సమావేశంలో పాల్గొన్నారు.
2026 జూన్ 10 నాటికి, ప్రధాని వరుసగా 12 ఏళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసి చరిత్ర సృష్టించారు. వరుసగా 4,399 రోజుల మైలురాయిని అధిగమించడం ద్వారా, దేశంలో మొదటి ప్రజాస్వామ్య సార్వత్రిక ఎన్నికల తర్వాత అత్యధిక కాలం 4,398 రోజులు నిరంతరాయంగా పదవిలో కొనసాగిన భారతదేశపు మొదటి ప్రధాన మంత్రి రికార్డు సృష్టించారు. గతంలో జవహర్లాల్ నెహ్రూ రికార్డును ఆయన అధిగమించారు. 2014లో తొలిసారిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఆయన ఈ పదవిలో కొనసాగుతున్నారు. 2019లో వరుసగా రెండోసారి 2024లో మూడవసారి ప్రజల మద్దతుతో విజయం సాధించారు.