రీపోలింగ్కు రెండు రోజుల ముందు బెంగాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. బెంగాల్లోని ఫల్టాలో పోలింగ్ సమయంలో అవకతవకలు జరగడంతో మే 21న రీపోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించింది. ఈ స్థానం నుంచి పోటీకి దిగిన టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. ఇకపై ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయబోనని ప్రకటించారు. బెంగాల్ సీఎం సువేందు అధికారి ఫల్టా అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నారని.. అందుకే తాను ఈ ఎన్నికల నుంచి తప్పుకొంటున్నానని తెలిపారు.
రీపోలింగ్కు ముందు జహంగీర్ పోటీ నుంచి వైదొలగడంపై తృణమూల్ కాంగ్రెస్ స్పందించింది. ఫల్టాలో రీపోలింగ్ వేళ జహంగీర్ ఖాన్ తీసుకున్న ఈ నిర్ణయం ఆయన వ్యక్తిగతమైనదని, ఇందులో పార్టీకి సంబంధం లేదని పేర్కొంది. మే 4న ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి.. ఒక్క ఫల్టాలోనే తమ పార్టీకి చెందిన 100 మందికి పైగా కార్యకర్తలను అరెస్టు చేశారని ఆరోపించింది. పార్టీ కార్యాలయాలను బీజేపీ నేతలు ధ్వంసం చేశారని పేర్కొంది. ఈ విషయంపై ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఈసీ చూసీచూడనట్లు వ్యవహరిస్తోందని పేర్కొంది. ఈ ఒత్తిడి వల్ల కొందరు నేతలు క్షేత్రస్థాయి నుంచి తప్పుకొంటున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. తమపై ఎన్ని కుట్రలు చేసినా బీజేపీకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని టీఎంసీ తెలిపింది.





Total views : 81773