తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లగా మారింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాబోయే 24 గంటల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
రాయలసీమలో వాతావరణం ప్రధానంగా పొడిగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ.. గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 34 నుంచి 35 డిగ్రీల వరకు, కనిష్ట ఉష్ణోగ్రతలు 28 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది. తెలంగాణలోనూ పలు జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై.. ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఉపరితల ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లోనూ వాతావరణం చల్లగా ఉండే అవకాశం ఉంది. నగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 30 నుంచి 31 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు 24 నుంచి 25 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. సాయంత్రం వేళల్లో చిరుజల్లులు కురిసే అవకాశాలున్నాయి. బలమైన ఈదురుగాలులు, ఉరుములు, పిడుగులతో వర్షాలు పడే సమయంలో ప్రజలు చెట్లు, విద్యుత్ స్తంభాల కింద ఉండకూడదని అధికారులు సూచిస్తున్నారు. వాతావరణ పరిస్థితులను ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.