తెలంగాణ ప్రజారోగ్య రంగంలో మరో కీలక అడుగు పడనుంది. హైదరాబాద్ సనత్నగర్లో నిర్మించిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అధికారికంగా ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభోత్సవం జరిగింది.కార్యక్రమానికి వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే లక్ష్యంగా టిమ్స్ను తీర్చిదిద్దారు.
1082 పడకల సామర్థ్యంతో ఏర్పాటైన ఈ ఆసుపత్రిలో 300 ఐసీయూ పడకలు, 31 అత్యాధునిక మేజర్ ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. గుండె, కిడ్నీ, కాలేయం, మెదడు వ్యాధులతో పాటు క్యాన్సర్, ట్రామా, అవయవ మార్పిడి వంటి 37 ప్రధాన వైద్య విభాగాల్లో నిపుణుల సేవలు అందుబాటులోకి రానున్నాయి. కార్డియాక్, రీనల్, న్యూరో, ట్రామా విభాగాల్లో ప్రత్యేక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలతో పాటు అధునాతన డయాగ్నస్టిక్ ల్యాబ్లు, ఇంటర్వెన్షనల్ రేడియాలజీ సేవలు అందించనున్నారు. టిమ్స్ అందుబాటులోకి రావడంతో గాంధీ, ఉస్మానియా, నిమ్స్ ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది.
టిమ్స్ ప్రారంభోత్సవానికి అన్ని శాఖలు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేశాయి. మంత్రి దామోదర రాజనర్సింహ ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాట్లను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమ వేదిక, ఎంట్రీ-ఎగ్జిట్ మార్గాలు, బందోబస్తు, ట్రాఫిక్, పార్కింగ్, క్రౌడ్ మేనేజ్మెంట్పై ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ఆసుపత్రి ప్రాంగణంలో పరిశుభ్రత, తాగునీరు, విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని సూచించారు. టిమ్స్ ప్రారంభంతో తెలంగాణలో పేదలకు అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ వైద్యం మరింత చేరువ కానుంది.