కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్ సమీపంలోకి చేరుకున్న టిడిపి అధినేత చంద్రబాబునాయుడు కాన్వాయ్. కలపర్రు టోల్ గేట్ వద్ద జాతీయ రహదారిపైకి వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు. చంద్రబాబును చూడనీయకపోతే కాన్వాయ్ ని కదలనీయబోమంటూ అడ్డుపడుతున్న ప్రజలు. రాత్రి 11.30గంటల ప్రాంతంలోనూ జాతీయరహదారిపై వేచిచూస్తున్న మహిళలు, అభిమానులు. రాజమండ్రి నుంచి 7గంటలకు పైగా సాగుతున్న చంద్రబాబునాయుడు ప్రయాణం. భారీగా తరలివస్తున్న ప్రజలు, అభిమానులు, కార్యకర్తలతో జాతీయరహదారిపై గంటకు 20కిలోమీటర్లు కూడా సాగని కాన్వాయ్. వేలాదిగా తరలివస్తున్న ప్రజలను అదుపుచేయలేక ఆపసోపాలు పడుతున్న పోలీసులు.
Chandrababu Bail
స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఆనందం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు బెయిల్ రావడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానాన్ని తాము ముందు నుంచి తప్పుపడుతున్నామని… నోటీసులు ఇవ్వకుండా, విచారణ జరపకుండానే ఆయనను అరెస్ట్ చేశారని విమర్శించారు. ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండానే ఎలా అరెస్ట్ చేస్తారని విమర్శించారు. బాబుకు బెయిల్ రావడం మంచి పరిణామమని చెప్పారు. మరోవైపు వైసీపీ ప్రభుత్వంపై పురందేశ్వరి విమర్శలు గుప్పించారు. నాణ్యత లేని మద్యాన్ని అమ్ముతూ, ప్రజల ఆరోగ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం నాశనం చేస్తోందని మండిపడ్డారు. మద్యం అమ్మకాల ద్వారా జేబులు నింపుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని దుయ్యబట్టారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేయడంపై రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. మిఠాయిలు పంచుకుంటూ, బాణాసంచా పేలుస్తూ కార్యకర్తలు, నాయకులు సంతోషంలో మునిగిపోయారు. రాజమండ్రి, హిందూపురం సహా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ అభిమానులు, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి సంతోషాన్ని పంచుకుంటున్నారు. టపాసులు కాలుస్తూ హోరెత్తిస్తున్నారు. అన్నమయ్య జిల్లా టిటిడి మాజీ పాలకవర్గ సభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు సుగువాసి ప్రసాద్ బాబు ఆధ్వర్యంలో రాయచోటి పట్టణం మాండవ్య నది ఒడ్డున వెలిసియున్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో 101 టెంకాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో టీడీపీ శ్రేణులు ఆనందంలో మునిగిపోయాయి. బెయిల్ మంజూరైన వెంటనే మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయం వద్ద మీడియాతో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ… చంద్రబాబు మీద వ్యక్తిగత కక్ష పెట్టుకుని, తప్పు లేకపోయినా కేసులు పెట్టారనే విషయం తెలుగు ప్రజలందరికీ తెలిసి పోయిందని అన్నారు. అక్రమ కేసులు పెట్టి, జైల్లో ఉంచి లబ్ధి పొందాలని జగన్ చూశారని విమర్శించారు. 45 ఏళ్ల రాజకీయ చరిత్రలో చంద్రబాబు చిన్న తప్పు కూడా చేయలేదని… పార్టీలో ఎవరు తప్పు చేసినా ఆయన సహించరని చెప్పారు. మహానుభావుడు చంద్రబాబును ఈ మూర్ఖుడు, ఈ దుర్మార్గుడు జగన్ 52 రోజుల పాటు జైల్లో పెట్టించారని అచ్చెన్న మండిపడ్డారు. బెయిల్ పై హైకోర్టు తీర్పును రిజర్వ్ చేస్తే… రాత్రికి రాత్రే చంద్రబాబుపై లిక్కర్ కేసు పెట్టించిన సైకో అని దుయ్యబట్టారు. చంద్రబాబు అరెస్ట్ జగన్ పతనానికి నాంది అని… బాబు జైలు నుంచి బయటకు అడుగు పెట్టిన క్షణం నుంచే వైసీపీ పతనమవుతుందని చెప్పారు. వైసీపీని బంగాళాఖాతంలో కలుపుతామని వ్యాఖ్యానించారు. హైకోర్టులో ఈరోజు తమకు న్యాయం జరిగిందని అన్నారు. ఇప్పటికే లోకేశ్ బాబు రాజమండ్రిలో ఉన్నారని… తాము కూడా ఇప్పుడు రాజమండ్రికి బయల్దేరుతున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో ఏం చేయాలనేది అందరం కూర్చొని చర్చించి నిర్ణయిస్తామని తెలిపారు.





Total views : 79368