దేశ వ్యాప్తంగా ఒక కేంద్ర పాలిత ప్రాంతం, నాలుగు రాష్ట్రాల్లో అత్యంత కీలకమైన తమిళనాడులోని 234 స్థానాలతో పాటు పశ్చిమ బంగాల్ లోని 152 స్థానాలకు నేడు పోలింగ్ జరగనుంది. ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే తమిళనాడుతో పాటు పశ్చిమ బంగాల్ ప్రాంతాల్లో కేంద్ర బలగాలను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు ఏర్పాట్లు చేసింది. ఇక నాయకులు కూడా హోరా హోరీగా ప్రచారం చేశారు.ఎన్నికల నియమావళి ప్రకారం మొన్నటి సాయంత్రంతో మైకులు మూగబోయాయి. ఓటర్లు నేడు తమకు కాబోయే నాయకుడు ఎవరనేది తమ ఓటుతో డిసైడ్ చేయనున్నారు.
తమిళనాడులో అన్నాడీఎంకే, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి, డీఎంకే, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమి, విజయ్ కు సంబంధించిన టీవీకే పోటాపోటీగా ప్రచారం చేశారు. తమిళనాడులోని అన్ని స్థానాలకు ఒక్క విడతతోనే పోలింగ్ జరగనుంది. డీఎంకే ఈ ఎన్నికల్లో 164 చోట్ల బరిలో దిగింది. మిగిలిన స్థానాలను తమ మిత్రపక్షాలకు కేటాయించింది. ప్రధాన ప్రతిపక్షం ఏఐఏడీఎంకే 169 స్థానాల్లో తన అభ్యర్ధులను నిలబెట్టింది. విజయ్ కు చెందిన తమిళ వెట్రి కళగం 234 స్థానాల్లో బరిలో దిగింది. మొత్తంగా 234 స్థానాలకు 4023 మంది బరిలో ఉన్నారు. మొత్తంగా 5,73,43, 291 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఇక దేశంలోని తూర్పున ఉన్న పశ్చిమబెంగాల్ లో రెండు విడతల్లో ఎన్నికల్లో జరగనున్నాయి. మమత నేతృత్వంలోని టీఎంసీ, భారతీయ జనతా పార్టీ తరపున ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్, హిమంత బిశ్వశర్మ సహా పలువువు కీలక బీజేపీ నేతలు ఎన్నికల్లో తమకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ సుడిగాలి పర్యటనలు చేశారు. ఇక ఎన్నికల సర్వేలో టీఎంసీ, బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా పోటీ నెలకొంది. ఇక పశ్చిమ బంగాల్ తొలి విడత ఎన్నికల్లో దాదాపు 3 కోట్ల 60 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.