పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ ఉద్రిక్తతలు భారత ఇంధన సరఫరాపై ప్రభావం చూపుతున్నాయి. దుబాయ్ నుంచి గుజరాత్ పోర్టుకు వస్తున్న ఒక భారతీయ చమురు నౌకను ఇరాన్ విప్లవాత్మక సైనిక దళాలు హర్మూజ్ జలసంధి వద్ద దిగ్బంధించాయి. దుబాయ్లోని జెబెల్ అలీ పోర్టు నుంచి ముడిచమురుతో గుజరాత్ వైపు వస్తున్న ఈ నౌకను, అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని దాటుతున్న సమయంలో IRGC నావికా దళాలు అడ్డుకున్నాయి. సముద్ర నిబంధనలు ఉల్లంఘించాయని ఆరోపిస్తూ, నౌకను తమ నియంత్రణలోకి తీసుకుని ఇరాన్ తీరానికి తరలించినట్లు సమాచారం. ప్రపంచ ముడిచమురు రవాణాలో 30 శాతానికి పైగా వాటా ఉన్న హర్మూజ్ జలసంధిలో ఇరాన్ పట్టు బిగించడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఇప్పటికే కొన్ని నౌకలపై కాల్పులు జరిగిన నేపథ్యంలో, తాజా దిగ్బంధం భారత నౌకాయాన రంగంలో ఆందోళన కలిగిస్తోంది.
నౌకలోని భారతీయ సిబ్బంది భద్రతపై భారత విదేశాంగ శాఖ ఇప్పటికే ఇరాన్ దౌత్యవేత్తలతో సంప్రదింపులు జరుపుతోంది. సిబ్బంది క్షేమంగా ఉన్నట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. గుజరాత్లోని కీలక పోర్టులకు చేరాల్సిన ఈ చమురు నౌక నిలిచిపోవడంతో, దేశీయంగా ఇంధన నిల్వలపై ప్రభావం పడకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తోంది. అమెరికా-ఇరాన్ యుద్ధ వాతావరణం వల్ల ఈ మార్గంలో ప్రయాణించే వాణిజ్య నౌకలకు భద్రత కరువైందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.