నల్లగొండ జిల్లాలో వడగళ్ల వాన అతలాకుతలం చేసింది. కొండమల్లేపల్లి మండలం చెన్నారంలో కురిసిన వడగళ్ల వానకు వరి పంట నేలకొరిగింది. ఒడ్లు పెద్ద ఎత్తున నేల రాలడంతో రైతులు లబోదిబోమంటున్నారు. చెన్నారం, ఏపూరితండ పరిధిలోని పర్వతరావు చెరువు ఆయకట్టు కింద పదిహేను వందల ఎకరాలలో వరి సాగు చేశారు. వడగళ్ల వానకు పంట అంతా నేలరాలిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదేళ్ల తరువాత పర్వతరావు చెరువు నిండడంతో పెద్ద ఎత్తున వరి సాగు చేశారు. నిన్నటి వరకు వరి పైరుని చూసి మురిసిపోయిన రైతులు వడగళ్ల వానతో వారి ఆనందం ఆవిరైపోయింది. అప్పులు చేసి వరి పండించారు. వడగళ్ళ వానతో వరి ధాన్యం రాలిపోయి గడ్డి మాత్రమే మిగిలింది. చేతికొచ్చిన పంట నేల రాలడంతో రైతులు బోరున విలపిస్తున్నారు. ఎకరాకు 50 బస్తాలు రావలసిన దిగుబడి 5 10 బస్తాలు కూడా రాదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.
Tag: