నీట్ పేపర్ లీక్ నిరసనల మధ్య ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్తతరం ప్రతి విషయాన్ని ప్రశ్నిస్తోందని, యువతకు సమాధానం ఇవ్వాల్సిందే అని స్పష్టం చేశారు. కొత్తతరంతో తల్లిదండ్రులు ఎక్కువ సమయం గడిపి వారి సందేహాలను నివృత్తి చేయాలని సూచించారు. ఢిల్లీలో జరిగిన ‘విశ్వ మాంగల్య సభ’ జాతీయ ప్రబోధన సమావేశంలో మాట్లాడిన RSS చీఫ్.. ప్రస్తుత సమాజంలో వస్తున్న మార్పులను, యువత ఆలోచనా విధానాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. నేటి కాలంలో ప్రతీది మొబైల్లోనే నిక్షిప్తమై ఉందన్నారు.
నేటి కుటుంబాల్లోనూ పరస్పర సంభాషణలు తగ్గిపోతున్నాయిని మోహన్ భగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలతో మరింత ఆప్యాయంగా మెలగాలని, వారి కోసం సమయం కేటాయించి మాట్లాడాలని ఆయన హితవుపలికారు. ప్రస్తుతం కొత్తతరం ప్రతి అంశంపై ప్రశ్నలు లేవనెత్తుతోందని, వారికి కేవలం ఆదేశాలు ఇవ్వడం కాకుండా తగిన కారణాలను వివరించాల్సిన బాధ్యత పెద్దలపై ఉందని అభిప్రాయపడ్డారు.
విదేశీ దండయాత్రలు, బ్రిటీష్ పాలన వల్ల భారత ప్రజల ఆలోచనా ధోరణి పూర్తిగా మారిపోయిందన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్. బ్రిటీష్ పాలన వల్ల మన సాంప్రదాయాలు తప్పని, విదేశీ పద్ధతులే సరైనవనే భావన భారతీయుల్లో పెరిగిందని వ్యాఖ్యానించారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానానికి భయపడాల్సిన అవసరం లేదన్నారు. టెక్నాలజీని మానవాళి శ్రేయస్సు కోసం వాడుకోవాలని సూచించారు. అపరిమితమైన కోరికలు, భౌతికవాదం సమాజంలో పోటీని, సంఘర్షణలను పెంచుతాయని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ హెచ్చరించారు.