యుద్ధం ముగిసిన తర్వాత గాజా ప్రాంతం అధికార పగ్గాలను వెస్ట్బ్యాంక్ను పాలించే పాలస్తీనా అథారిటీయే చేపట్టాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. అంతిమంగా రెండు దేశాల ఏర్పాటుతో ఇజ్రాయెల్, పాలస్తీనా ఘర్షణకు తెరపడాలని ఆయన ఆకాంక్షించారు. గాజా నుంచి పాలస్తీనావాసులను బలవంతంగా పంపించకూడదని ఇజ్రాయెల్కు బైడెన్ సూచించారు. గాజాలో మళ్లీ ఇజ్రాయెల్ ఆర్మీ ఆక్రమణలు చేయకూడదని తేల్చి చెప్పారు. ‘ది వాషింగ్టన్ పోస్టు’కు రాసిన ప్రత్యేక కాలమ్లో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వెస్ట్బ్యాంక్లోని పాలస్తీనా పౌరులపై దాడులు చేస్తున్న ఇజ్రాయెలీ అతివాదులకు అమెరికా వీసాలను ఇవ్వబోమని బైడెన్ వార్నింగ్ ఇచ్చారు. సాధారణ పౌరులను ఇబ్బందిపెడుతున్న ఇలాంటి వారిని గుర్తించి, తగిన మూల్యం చెల్లించేలా ఏర్పాట్లు చేయాలని ఇజ్రాయెల్ను బైడెన్ కోరారు. దీనిపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు వాదన ఇంకోలా ఉంది. ‘‘పాలస్తీనా అథారిటీకి గాజాను పాలించే సామర్థ్యం లేదు అనీ యావత్ గాజా సైనిక రక్షణ బాధ్యతలను ఇజ్రాయెల్ చూస్తుందన్నారు. పాలస్తీనాలోని వెస్ట్ బ్యాంక్ ఏరియాలో సైన్యం దాడులు, ఇజ్రాయెలీ సెటిలర్ల హింస కారణంగా గత రెండు వారాల్లో 200 మంది పాలస్తీనియన్లు చనిపోయిన నేపథ్యంలో బైడెన్ పై ప్రకటనను విడుదల చేశారు.
palestine
ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధ నేపథ్యంలో తీవ్రంగా నష్టపోయిన పాలస్తీనా ప్రజలను ఆదుకునేందుకు భారత్ మానవతా సాయం అందిస్తుంది. గత నెలలో మొదటి విడతలో భాగంగా 6.5 టన్నుల సామాగ్రిని పంపిన భారత్, తాజాగా రెండో విడత సాయాన్ని పంపింది. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. తాము పాలస్తీనా ప్రజలకు మానవతా సాయాన్ని అందిస్తూనే ఉంటామని ఎక్స్ లో ట్వీట్ చేశారు. భారత వైమానిక దళానికి చెందిన రెండవ సీ17 విమానం 32 టన్నుల సాయంతో ఈజిప్ట్ కి బయలుదేరిందని పోస్ట్ చేశారు. ఈ సామాగ్రిని మొదట ఈజిప్టులోని ఎల్-అరిష్ విమానాశ్రయానికి చేరుస్తారు. అక్కడి నుంచి రఫా సరిహద్దు గుండా గాజాకు తీసుకెళ్తారు. ప్రస్తుతం గాజాలోకి మానవతా సాయం కోసం రఫా మాత్రమే క్రాయింగ్ పాయింట్ గా ఉంది. అయితే గాజాలో రహదారులన్నీ తీవ్రంగా ధ్వంసం కావడంతో వివిధ దేశాలు పంపించే మానవతా సాయం అందించే ప్రక్రియ పూర్తి స్థాయిలో జరగడంలేదు.






Total views : 79689