వైసీపీ మహిళా నేత, మాజీ మంత్రి రోజాకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఓ పత్రిక ప్రతులను దహనం చేసిన కేసులో విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. చిత్తూరు జిల్లా నగరిలోని ఆమె నివాసానికి వెళ్లిన తిరుపతి ఈస్ట్ పోలీసులు, ఈ నెల 30న విచారణకు రావాలని నోటీసుల్లో స్పష్టం చేశారు.
కొన్ని రోజుల క్రితం, తమ పార్టీ నాయకుల కుటుంబాల్లోని మహిళలను కించపరిచేలా ఓ దినపత్రికలో అసత్య కథనాలు ప్రచురించారని ఆరోపిస్తూ రోజా నిరసన తెలిపారు. అందులో భాగంగా పత్రిక ప్రతులను దహనం చేశారు. ఈ ఘటనపై నమోదైన కేసులో భాగంగానే పోలీసులు తాజాగా నోటీసులు అందజేశారు.
కూటమి ప్రభుత్వం తనపై రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని, అందులో భాగంగానే అక్రమ కేసులు బనాయించిందని రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని పక్కనపెట్టి, కూటమి ప్రభుత్వం ‘రెడ్ బుక్ రాజ్యాంగాన్ని’ అమలు చేస్తోందని తీవ్రంగా విమర్శించారు. వైసీపీ అధినేత జగన్ తో పాటు, పార్టీ నాయకుల కుటుంబాల్లోని మహిళలను కించపరిచేలా ఓ పత్రికలో అవాస్తవ కథనాలు ప్రచురించారని, అందుకే నిరసనగా ఆ పత్రిక ప్రతులను దహనం చేశామని స్పష్టం చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపితే కేసులు పెట్టడం ఏమిటని ఆమె ప్రశ్నించారు.