కేంద్ర ప్రభుత్వం మరోసారి ‘భారతరత్న’ పురస్కారాలను ప్రకటించింది. మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు , చరణ్ సింగ్ , ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ ను అత్యున్నత పౌర పురస్కారంతో గౌరవించింది. ఈ మేరకు ప్రధాని మోదీ ట్విటర్ వేదికగా వెల్లడించారు. దేశానికి వీరు అందించిన సేవలను కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా పివి నరసింహారావు చేసిన కృషి చిరస్మరణీయం. దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడంలో ఆయన నాయకత్వం బలమైన పునాది వేసిందని మోదీ తెలిపారు. పీవీ హయాంలో ప్రపంచ మార్కెట్ను భారత్ ఆకర్షించిందని.. ఆయన పాలనలో ఆర్థిక వృద్ధికి కొత్త శకం మొదలైందన్నారు. విదేశాంగ విధానం, విద్యా రంగంలో ఆయన అందించిన సహకారం.. దేశాన్ని సాంస్కృతికంగా, మేధోపరంగా సుసంపన్నం చేసిందని ప్రధాని మోదీ కొనియాడారు. మాజీ ప్రధాని చరణ్ సింగ్, శాస్త్రవేత్త స్వామినాథన్ కృషిని కూడా ప్రధాని మోదీ కొనియాడారు.