అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూరోపియన్ యూనియన్ పై మరోసారి సుంకాల మోత మోగించారు. యూరోపియన్ దేశాల నుండి దిగుమతి అయ్యే కార్లు, ట్రక్కులపై సుంకాలను 25 శాతానికి పెంచుతున్నట్లు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఈ కొత్త నిబంధనలు వచ్చే వారం నుండే అమలులోకి రానున్నాయి. గత ఏడాది జూలైలో కుదిరిన ‘టర్న్బెర్రీ ఒప్పందం’ నిబంధనలను యూరోపియన్ యూనియన్ పాటించడం లేదని ట్రంప్ ఆరోపించారు. ఒప్పందం ప్రకారం సుంకాలు 15 శాతం వరకు ఉండాలి, కానీ ఈయూ సహకరించకపోవడం వల్లే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఒకవేళ యూరోపియన్ కంపెనీలు తమ కార్లు, ట్రక్కులను అమెరికాలోని ప్లాంట్లలోనే తయారు చేస్తే, వాటిపై ఎలాంటి సుంకాలు ఉండవని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికాలో ఉపాధి పెంచడమే తన లక్ష్యమని ‘ట్రూత్ సోషల్’ వేదికగా వెల్లడించారు. ఈ నిర్ణయం వల్ల ముఖ్యంగా జర్మనీ వంటి దేశాల ఆటోమొబైల్ పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. మరోవైపు ట్రంప్ నిర్ణయాన్ని ఆర్థిక బ్లాక్ మెయిలింగ్గా ఈయూ అభివర్ణిస్తోంది. దీనికి ప్రతిగా అమెరికా ఉత్పత్తులపై కూడా ప్రతీకార సుంకాలు విధించే దిశగా ఈయూ యోచిస్తోంది.





Total views : 75122