కృష్ణా జిల్లాలోని గన్నవరం మండలంలో అక్రమ క్వారీ తవ్వకాలపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. గోపవరపు గూడెం శివారులో నిబంధనలకు విరుద్ధంగా భారీ స్థాయిలో ఎర్రమట్టి క్వారీ తవ్వకాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు స్థానికులను కలవరపెడుతున్నాయి. అనుమతులు లేకుండానే కొన్ని చోట్ల తవ్వకాలు జరుగుతున్నాయి .మరో కొన్ని చోట్ల అనుమతుల పరిమితిని మించి నాలుగు నుంచి ఐదు అంతస్తుల లోతు వరకు తవ్వుతున్నారని గ్రామస్థులు చెబుతున్నారు. భూగర్భంలోని ఎర్రమట్టిని పెద్ద ఎత్తున తరలించడంతో పర్యావరణ సమతౌల్యం దెబ్బతింటోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా భూగర్భ జలాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని వాపోతున్నారు . నీటి వనరులు క్షీణిస్తే భవిష్యత్తులో తాగునీటి సమస్య మరింత తీవ్రం అవుతుందని భయపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో అధికారుల నిర్లక్ష్యం పై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెంటనే సంబంధిత శాఖలు స్పందించి తవ్వకాలను నిలిపివేసి, పరిస్థితిని సమీక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
గన్నవరం మండలం గోపవరపు గూడెం పరిసరాల్లో కొనసాగుతున్న క్వారీ తవ్వకాల వల్ల స్థానిక ప్రజల్లో భయాందోళనలు మరింత పెరుగుతున్నాయి. భూమిని అధిక లోతు వరకు తవ్వడం వల్ల భూగర్భంలో ఖాళీలు ఏర్పడి, భవిష్యత్తులో నేల కుంగిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రభావం సమీపంలోని వ్యవసాయ భూములపై కూడా పడుతూ రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడుతోంది. పంటలు సాగు చేయడానికి అవసరమైన నీటి వనరులు తగ్గిపోవడం రైతులను ఆర్థికంగా కుంగదీస్తోంది. అంతేకాక ఈ క్వారీకి ఇచ్చిన అనుమతుల పరిమితి ఎంత, ప్రస్తుతం జరుగుతున్న తవ్వకాలు ఆ పరిధిలోనే ఉన్నాయా అనే అంశంపై స్పష్టత లేకపోవడం మరింత అనుమానాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, మైనింగ్ శాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగి పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటేనే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని వారు అభిప్రాయపడుతున్నారు.






Total views : 74955