ఆంధ్రప్రదేశ్ను గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ , టెక్నాలజీ కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. శ్రీసిటీలో క్యారియర్ ఎయిర్ కండిషనింగ్ యూనిట్కు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేయడంతో ఈ దిశగా ముందడుగు పడిందని చెప్పొచ్చు .డేటా సెంటర్ల నిర్మాణం ప్రారంభం మాత్రమేనని, వాటికి అవసరమైన పరికరాల తయారీలో దేశం అగ్రగామిగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నారు . ఆధునిక డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో డేటా సెంటర్ల పాత్ర కీలకంగా మారడంతో వాటి కోసం అవసరమైన కూలింగ్ సిస్టమ్స్, పవర్ ఎలక్ట్రానిక్స్, కంట్రోల్ టెక్నాలజీస్ వంటి రంగాల్లో దేశీయ తయారీ పెరగాల్సిన అవసరం ఉంది . శ్రీసిటీ ఇప్పటికే గ్లోబల్ స్థాయిలో గుర్తింపు పొందిన ఇండస్ట్రియల్ హబ్గా నిలిచింది . వివిధ దేశాల కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడం రాష్ట్రంపై ఉన్న విశ్వాసానికి నిదర్శనంగా చెప్పొచ్చు . ఈ ప్రాజెక్ట్ ద్వారా వేలాది ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా, యువతకు నైపుణ్యాభివృద్ధి అవకాశాలు పెరుగుతాయని నిపుణులు అంటున్నారు .
ఇండియాస్ “కూల్ క్యాపిటల్”గా ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు సంపాదించిందని మంత్రి లోకేష్ ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్రంలో ఏసీ తయారీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుండగా, 2027 నాటికి దేశంలో ఉత్పత్తి అయ్యే ఏసీలలో 60 శాతం ఏపీ నుంచే రావాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. శ్రీసిటీ వంటి పారిశ్రామిక ప్రాంతాలు ఈ అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తున్నాయి. 8,500 ఎకరాల్లో విస్తరించిన ఈ ఇండస్ట్రియల్ జోన్లో ఇప్పటికే వందలాది కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తూ వేలాది ఉద్యోగాలను కల్పిస్తున్నాయి. క్యారియర్ సంస్థ రూ.1000 కోట్ల పెట్టుబడితో 3000 ఉద్యోగాలను సృష్టించనుండడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపునిస్తుంది. డేటా సెంటర్ పరికరాల తయారీ రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా గ్లోబల్ సరఫరా గొలుసులో ఏపీ కీలక స్థానాన్ని సంపాదించగలదని లోకేష్ విశ్వాసం వ్యక్తం చేశారు. 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.






Total views : 75195