ఆంధ్రప్రదేశ్లో భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన 17వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల బోర్డు సమావేశం జరిగింది. SIPB సమావేశంలో దాదాపు 2లక్షల కోట్ల పెట్టుబడులకు బోర్డు ఆమోదం తెలపగా… 39వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. నిర్దేశిత గడువుకు ముందే అనుమతులతో బ్రాండ్ సృష్టిద్దామని సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వస్తోందని … విశాఖలో రిలయన్స్ సంస్థ ఒకలక్షా 8 వేల కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చిందని తెలిపారు. అలాగే సత్యసాయి జిల్లాలో 51 వేల కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్ ను, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టంను కూడా రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేయనుంది. కడపలో 12 వేల కోట్లతో అదానీ హైడ్రో ఎనర్జీ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టును, తిరుపతిలో 2 వేల 5 వందల కోట్లతో రాయల్ ఎన్ఫీల్డ్ మోటర్ సైకిల్ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. వీటితో పాటు పలు పెట్టుబడులకు రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి వచ్చిన ప్రతీ ప్రతిపాదనా ఒప్పందంగా మారాలని, కుదుర్చుకున్న ప్రతీ ఒప్పందం పెట్టుబడిగా రూపాంతరం చెందాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఒక పెట్టుబడి, పరిశ్రమ రాష్ట్రానికి వచ్చే విషయంలో అనుమతుల నుంచి శంకుస్థాపన, ప్రారంభోత్సవం వరకు నిర్దేశిత గడువులోగా జరిగేలా చూడాలన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో పెట్టుబడులను ఆకర్షించాలంటే ఇతరుల కంటే మనం ఎలా భిన్నమో ఏపీలో అనుమతులు ఎంత సులభతరమో వారికి చెప్పాలని స్పష్టం చేశారు. ఏపీలో ప్రాజెక్టులు రావాలన్న తపన ఉన్న అధికారులను అనుమతులు ఇచ్చే స్థానాల్లో నియమించాలని సూచించారు.
చంద్రబాబు అధ్యక్షతన 17వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల బోర్డు సమావేశం..
63





Total views : 75059