పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలుకానుంది. ఒకప్పటి తన రాజకీయ గురువైన మమతా బెనర్జీ స్థానంలో బీజేపీ నేత సువేందు అధికారి బెంగాల్ కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నట్టు తెలుస్తోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది ఆ పార్టీ. రేపు కోల్కతాలో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సువేందు అధికారిని శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య ఆయన పేరును ప్రతిపాదించనుండగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది.
ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫున సువేందు అధికారి బలమైన అభ్యర్థిగా నిలిచారు. ఒకప్పుడు మమతా బెనర్జీ అధికారంలోకి రావడానికి కారణమైన నందిగ్రామ్లో.. ఆమెపై గెలిచి సంచలనం సృష్టించారు. తాజాగా ఆమె కంచుకోటగా భావించే భవానీపూర్లోనూ భారీ మెజారిటీతో విజయం సాధించి, పార్టీలో తిరుగులేని నేతగా ఆవిర్భవించారు. ఈ విజయాలే ఆయనను ముఖ్యమంత్రి పీఠం వైపు నడిపిస్తున్నాయని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.





Total views : 75187