తిరుమల శ్రీవారి భక్తుల కు సత్వర దర్శనం కల్పించడమే పరమావధిగా టీటీడీ పాలక మండలి సంచలన నిర్ణయాలు తీసుకుంది. సామాన్య భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని జులై 15వ తేదీ వరకు వీఐపీ సిఫార్సు లేఖలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దర్శనం కోసం వేచి ఉండే సమయాన్ని తగ్గించడంతో పాటు అలిపిరి టోల్ గేట్ వద్ద వాహనాల రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టనుంది. తిరుమల ఆధ్యాత్మిక శోభను పెంచేలా అక్కడి వీధులకు కొత్త పేర్లు పెట్టాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది.ఆధ్యాత్మిక సేవే కాకుండా కళలకు, ఉద్యోగుల సంక్షేమానికి టీటీడీ అగ్రతాంబూలం ఇచ్చింది. ప్రముఖ సంగీత విద్వాంసురాలు శోభారాజ్ని టీటీడీ ఆస్థాన విద్వాంసురాలుగా నియమించింది. ఉద్యోగుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించిన బోర్డు టీటీడీ హెల్త్ స్కీమ్ పరిమితిని 5 లక్షల రూపాయలకు పెంచింది. ఇక ఉద్యోగుల ఇంటి స్థలాల అభివృద్ధికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడంతో పాటు సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోరికను సైతం నెరవేర్చింది.ఇకపై కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి కూడా అధికారిక ఐడీ కార్డులు, స్వామివారి దర్శనం, లడ్డూ కార్డులు మంజూరు చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఈ నిర్ణయాల ద్వారా క్షేత్రస్థాయి సిబ్బందిలో నూతనోత్సాహం నింపడమే కాకుండా సామాన్య భక్తులకు మరింత సౌకర్యవంతమైన సేవలందించే దిశగా టీటీడీ అడుగులు వేస్తోంది.
టీటీడీ పాలక మండలి సమావేశంలో 82 అంశాలపై చర్చించారు. తిరుమలలోని ఆళ్వార్ కూడలి నుంచి బాలగంగమ్మ కూడలి వరకు శౌచాలయాల నిర్మాణాలకు 4.54 కోట్ల రూపాయల నిధుల మంజూరు చేయాలని నిర్ణయించింది. గోగర్భం డ్యామ్ నుంచి ఫిల్టర్ హౌస్ వరకు 6 కోట్ల రూపాయలతో పైపు లైన్లు, 44.2 కోట్ల రూపాయాల వ్యయంతో ఏపీకి చెందిన ఆప్కో, తమిళనాడుకు చెందిన కో ఆప్టెక్స్ సంస్థల నుంచి పట్టు వస్త్రాలు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. అదేవిధంగా తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులోని జీ- స్క్వేర్ సంస్థ తితిదే పేరిట రిజిస్టర్ చేసిన 19.49 ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు పాలక మండలి సభ్యులు ఆమోదం తెలిపారు. రాష్ట్ర రాజధాని అమరావతిలోని శ్రీవారి ఆలయంలో నూతన మండపాల నిర్మాణానికి 36.9 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయనున్నారు. పాలక మండలి తీసుకున్న ఈ సమగ్ర నిర్ణయాలు అటు భక్తుల నుంచి ఇటు సిబ్బంది నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.





Total views : 75043