ఉమ్మడి కర్నూలులో బెల్ట్ షాపుల అక్రమాలు.
ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా మద్యం బెల్ట్ షాపులు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. అధికారిక మద్యం దుకాణాలు తక్కువగా ఉండటం, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ ఎక్కువగా ఉండటాన్ని ఆసరాగా చేసుకుని లైసెన్సుదారులు గ్రామాల్లో అక్రమ కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. పల్లెపల్లెనా మద్యం ఏరులై పారుతుండటంతో సామాన్య ప్రజలు, ముఖ్యంగా మహిళలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గల్లీకో షాపు.. ఇష్టారాజ్యంగా ధరలు పెంచి అమ్ముతున్నారు. జిల్లాలోని దాదాపు అన్ని గ్రామ పంచాయతీల్లో యథేచ్ఛగా బెల్ట్ షాపులు కొనసాగుతున్నట్లుగా అనధికారిక సమాచారం. ప్రభుత్వం నిర్ణయించిన MRP ధరల కంటే ఈ షాపుల్లో ఒక్కో క్వార్టర్ బాటిల్పై 30 రూపాయల నుండి నుండి 50 రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. ఇక వేసవి తాపం దృష్ట్యా బీర్ ల ధరలకు రెక్కలొచ్చాయి. ఒక్కో బీరుపై 50 నుంచి 70 రూపాయల వరకు అదనపు లాభాన్ని ఆర్జిస్తూ బెల్ట్ షాపు నిర్వాహకులు మందుబాబులను నిలువునా దోచుకుంటున్నారు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆలూరు నియోజకవర్గంలో ఈ అక్రమ మద్యం ఏరులై పారుతున్నా సంబంధిత ఎక్సైజ్ శాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడంలేదంటూ అనేక ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయి. ఒకపక్క వేసవికాలం రావడంతో కనీసం నీటి చుక్క దొరకని పరిస్థితి కొన్ని గ్రామాల్లో నెలకొంది . కానీ పల్లెల్లో అంగట్లో సరుకులు మాదిరి యదేచ్చగా మద్యం లభిస్తుంది… బెల్ట్ షాపుల నిర్వహణ చట్టరీత్యా నేరమని తెలిసినా, ఎక్సైజ్ , పోలీస్ శాఖలు నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని చోట్ల రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తుల అండదండలతో ఈ దందా సాగుతుండటంతో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఉమ్మడి జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించి కొన్ని బాటిళ్లను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశామని ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నా , క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏమాత్రం మారడం లేదు. అంతేగాక కర్నూలు జిల్లాకు కర్ణాటక, తెలంగాణ సరిహద్దులు ఉండటంతో.. అక్కడ నుంచి నాన్-డ్యూటీ పెయిడ్ లిక్కర్ అక్రమంగా తరలిస్తూ బెల్ట్ షాపుల ద్వారా విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడమే కాకుండా, ప్రజల ఆరోగ్యానికి కూడా ముప్పుగా పరిణమిస్తోంది.
ఇక బనగానపల్లె నియోజకవర్గం లో మద్యం బెల్టు షాపులు యదేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఏ పల్లె కు వెళ్లినా ఏ గ్రామానికి వెళ్లినా బెల్ట్ షాపులు దర్శనమిస్తున్నాయి. 24 గంటల పాటు మద్యం అందుబాటులో ఉండడంతో మద్యం ప్రియులు నిత్యం మత్తులో మునిగితేలుతున్నారు .గ్రామాల్లో సైతం మద్యం బాటిల్ లు, బీర్లు అందుబాటులోకి రావడంతో యువత చెడు వ్యసనాలకు బానిసై వారి కుటుంబాల్లో తీరని నష్టాన్ని కలిగిస్తున్నారు. అధికార పార్టీ నాయకులకు మద్యం బెల్టు షాపులు ఒక ఆదాయ వనరుగా మారాయని విమర్శలు వస్తున్నాయి .గ్రామస్థాయి నాయకులు ఒక్కొక్క మద్యం బెల్టు షాపుకు వెల కట్టి నెల మామూలు వసూళ్లు చేస్తున్నారంటే మద్యం వ్యాపారం ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు..దీనిపై ఆళ్లగడ్ఢ ఎక్సైజ్ సీఐ స్పందించారు .అక్రమ బెల్టు షాప్ ల పై సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు .
మద్యం బెల్ట్ షాపులు గ్రామాల్లో కనిపించవద్దని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి . గ్రామాల్లో ఎక్కడ చూసినా మద్యం ఏరులై పారుతుంది. ప్రభుత్వం మద్యం దుకాణాల్లో సైతం నిబంధనలు పాటించడం లేదు.. ఉదయం 10 గంటల నుండి రాత్రి పది గంటల వరకు మాత్రమే తెరీసి ఉండాల్సిన మద్యం దుకాణాలు ఆ నిబంధనను పాటించడం లేదు
మద్యం దుకాణం బంద్ చేసిన వెంటనే పక్కనే ఉన్న పర్మిట్ రూం లలో 24 అవర్స్ మద్యం అందుబాటులో ఉంచుతున్నారు. ఇంత జరుగుతున్న ఒక వైపు ప్రభుత్వం మరోవైపు అధికారులకు ఇదేమీ పట్టడం లేదు
ఒక్కొక్క బెల్ట్ షాపు నుండి పోలీస్ స్టేషన్ కు నెల వసూళ్లు అందుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ పేరుతో పోలీస్ స్టేషన్ కు ఒక్కొక్క బెల్టు షాపు నిర్వాహకుడు తన వ్యాపార స్థాయిని బట్టి నెలకు రూ. 20 వేల నుండి రూ. 30 వేల రూపాయల వరకు సమర్పించుకోవాల్సి వస్తుందని సాక్షాత్తు మద్యం బెల్టు షాపుల నిర్వాహకులు అంటున్నారు.
పనిలో పనిగా ఎక్సైజ్ సిబ్బంది కూడా నెలవారి మామూళ్లు దండుకుంటున్నారు . బెల్ట్ షాపుల్లో క్వాటర్ బాటిల్ పై రూ.50 నుండి రూ. 100 వరకు అధికంగా అమ్ముతూ మద్యం రాయుళ్లను దోపిడీ చేస్తున్నారు.ఇలా అధికంగా వచ్చిన డబ్బులను గ్రామ నాయకులు , స్థానిక పోలీసులు, ఎక్సైజ్ పోలీసులు వాటాలు వేసుకుని పంచుకుంటున్నారు .మద్యం అక్రమ వసూళ్లు ఏ స్థాయిలో ఉన్నాయంటే ఎక్సైజ్, పోలీస్ సిబ్బంది కి వారి నెలవారి జీతాలు కంటే అధికంగా ఉన్నాయని సాక్షాత్తు ఎక్సైజ్ పోలీస్ సిబ్బండే చర్చించుకోవడం విశేషం ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో మద్యం అక్రమ దందా పై దృష్టి సారించి సామాన్య ప్రజలను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మరో వైపు ఎమ్మిగనూరులో బెల్ట్ షాపులు యదేచ్చగా కొనసాగుతున్నాయి.ప్రభుత్వం వైన్ షాపులకు అనుమతిచ్చిన తరవాత కొన్ని రోజులు ఇటు పోలీసులు, అటు ఎక్సైజ్ అధికారులు హడావుడి చేసి మద్యం అక్రమ అమ్మకాలు, రవాణాలపై కేసులు పెట్టారు. ప్రస్తుతం వాటివైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో ఎమ్మిగనూరులో మద్యం విక్రయదారులకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. పర్మిట్ రూంల అనుమతి లేకపోయినా మద్యం దుకాణం పక్కనే అదనంగా మరో గది నిర్మించి యథేచ్ఛగా విక్రయిస్తున్నారు.మద్యం బెల్టు దుకాణాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వం నిబంధనలు పెట్టింది. మద్యం ఏ దుకాణంలో దొరికిందో తెలుసుకుని ఆ దుకాణదారుడికి రూ.అయిదు లక్షలు జరిమానా విధిస్తారు. ఇలా రెండు, మూడుసార్లు దొరికితే ఆ బెల్ట్ షాప్ సీజ్ చేయాలనే నిబంధనలున్నాయి. ఎక్సైజ్ శాఖ దాడుల్లో గొలుసు దుకాణాల్లో భారీ మద్యం దొరికినా నాలుగైదు క్వార్టర్ల మద్యం చూపించి నామమాత్రపు కేసులు పెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే అంతకంటే ఎక్కువ మద్యం స్వాధీనం చేసుకుంటే దుకాణ యజమానికి రూ. 5 లక్షల జరిమానా విధించాల్సి ఉంటుంది. దీంతో ఈ దాడులు తూతూమంత్రంగానే జరుగుతున్నాయి..దీనిపై స్థానిక ఎక్సైజ్సీఐని వివరణ అడగడానికి వెళ్లిన సివిఆర్ ప్రతినిధులపై సి ఐ దురుసుగా ప్రవర్తించడం విస్మయానికి గురిచేస్తుంది .బెల్టు షాప్ లతో లాలూచి పడినట్లు స్థానికంగా టాక్ నడుస్తుంది .అందుకే ఏమి పట్టనట్లు దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తుంది. ఏదిఏమైనా అక్రమ బెల్టు షాప్ వల్ల మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటున్న ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది .దీనికి అడ్డుకట్ట వేయాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు .




Total views : 81759