విశాఖపట్నం పర్యాటక రంగాన్ని మరింత పరుగులు పెట్టించేందుకు ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ ప్రయత్నం చేస్తోంది. ఇందుకోసం వినూత్నంగా ముందుకు వెళుతోంది. ప్రముఖ బైక్ టాక్సీ సంస్థ ‘రాపిడో’తో టూరిజం శాఖ కీలక ఒప్పందాన్ని చేసుకుంది. ఈ ఒప్పందం ద్వారా రాపిడో డ్రైవర్లు కేవలం ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడమే కాకుండా, ‘టూరిస్ట్ గైడ్’లుగా కూడా వ్యవహరించనున్నారు. ఇందుకోసం రాపిడో ప్రతినిధులకు పర్యాటక ప్రాంతాల విశేషాలు, వాటి చరిత్రపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. తద్వారా పర్యాటకులు రాపిడో బైక్ లేదా ఆటో ఎక్కినప్పుడు వారు సందర్శించే ప్రాంతాల విశిష్టతను ఈ ‘డ్రైవర్ కమ్ గైడ్లు’ ప్యాసింజర్లకు వివరించనున్నారు.
ఈ వినూత్న సేవల కోసం తొలి విడతగా 350 మంది రాపిడో డ్రైవర్లను ప్రత్యేకంగా సిద్ధం చేశారు. వీరంతా పర్యాటకులకు సేవలందించేందుకు ఇవాళే రంగంలోకి దిగారు. విశాఖపట్నంలో ప్రయోగాత్మకంగా ప్రారంభమైన ఈ స్మార్ట్ టూరిజం సేవలను, రాబోయే రోజుల్లో విజయవాడతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రధాన పర్యాటక నగరాలకు కూడా విస్తరించనున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే ర్యాపిడితో టూరిజం శాఖ చేసుకున్న ఒప్పందంతో విశాఖ వచ్చే పర్యాటకులకు సరికొత్త, వినూత్నమైన ప్రయాణ అనుభూతిని అందించడమే కాకుండా నగర టూరిజం ప్రమోషన్కు పెద్ద బూస్ట్ లభించనుంది.




Total views : 90034