డ్రోన్లు, క్షిపణులతో పశ్చిమాసియా మరోసారి దద్దరిల్లింది. శాంతి చర్చలు కొనసాగుతుండగానే అమెరికా-ఇరాన్ మధ్య ప్రత్యక్ష ఘర్షణలు చోటుచేసుకున్నాయి. కువైట్, బహ్రెయిన్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులకు దిగగా.. వాటిని తమ రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నట్లు ఆయా దేశాలు ప్రకటించాయి. ఖేష్మ్ ద్వీపంలోని ఇరాన్ సైనిక స్థావరాలపై అమెరికా దాడులకు ప్రతీకారంగానే ఈ చర్యలు చేపట్టినట్లు ఇరాన్ తెలిపింది. ఇరువైపులా ఆరోపణలు, ప్రతిఆరోపణలతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి.
పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొత్త మలుపు తిరిగాయి. కువైట్లోని అల్ సలేం వైమానిక స్థావరం, బహ్రెయిన్లోని ఈసా ఎయిర్బేస్ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులకు దిగింది.కువైట్ వ్యాప్తంగా తెల్లవారుజామున భారీ పేలుడు శబ్దాలు వినిపించడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇరాన్ నుంచి దూసుకొచ్చిన క్షిపణులు, డ్రోన్లను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకున్నాయని కువైట్ ఆర్మీ జనరల్ స్టాఫ్ ప్రకటించింది.
మరోవైపు బహ్రెయిన్లో కూడా ప్రమాద హెచ్చరిక సైరన్లు మోగాయి. వెంటనే సైన్యం అప్రమత్తమై భద్రతా చర్యలను ముమ్మరం చేసింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికార యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది.ఖేష్మ్ ద్వీపంలోని తమ సైనిక స్థావరాలపై అమెరికా దాడులకు ప్రతిస్పందనగానే ఈ చర్యలు చేపట్టినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ వెల్లడించింది. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు శత్రువుల స్థావరాలపై మరింత తీవ్ర చర్యలకు కూడా వెనుకాడబోమని హెచ్చరించింది.
బహ్రెయిన్లోని అమెరికా నేవీ ఐదో ఫ్లీట్ ప్రధాన కార్యాలయం, మరో వైమానిక స్థావరంపై విజయవంతంగా దాడులు జరిపినట్లు ఐఆర్జీసీ ప్రకటించింది. అయితే ఈ వాదనలను అమెరికా సెంట్రల్ కమాండ్ పూర్తిగా ఖండించింది.ఇరాన్ చేపట్టిన దాడులన్నీ విఫలమయ్యాయని, తమ బలగాలు అప్రమత్తంగా ఉన్నాయని అమెరికా సెంట్కామ్ స్పష్టం చేసింది. ఖేష్మ్ ద్వీపంపై జరిపిన దాడులు పూర్తిగా ఆత్మరక్షణ కోసమేనని పేర్కొంది.




Total views : 92124