అమెరికాలోని లూసియానాలో విషాద ఘటన చోటుచేసుకుంది. తెలంగాణవాసి అనురూప్ రెడ్డి ..ముగ్గురు స్నేహితులను కాపాడి..అనూహ్య రీతిలో ప్రాణాలు కోల్పోయాడు. సరదాగా ముగ్గురు స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు లూసియానాలోని టొరోడో పార్క్లోని సెబాన్ రివర్లోకి కోడూరు అనురూప్ రెడ్డి వెళ్లాడు. హఠాత్తుగా స్నేహితులు ముగ్గురూ లోతు ప్రదేశంలోకి వెళ్లి ‘రక్షించండి’ అంటూ కేకలు వేయడంతో అనురూప్ రెడ్డి ఒక్కొక్కరిని పైకి లాగుతూ ఓడ్డుకు చేర్చాడు. కానీ… అనూహ్యంగా అనురూపు రెడ్డి పైకి వచ్చే క్రమంలో ఫిషింగ్ వైర్ కాలికి చుట్టుకుని పైకి రావడం కష్టంగా మారింది. ఒడ్డున ఉన్న స్నేహితులు, ఈతగాళ్లు అనూప్ రెడ్డిని ఒడ్డుకు తీసి.. స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనురూప్రెడ్డి అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధరించారు. టీం ఎయిడ్ స్వచ్ఛంద సంస్థ, ఇండియన్ ఎంబసీ, లూసియానా కాన్సోలేట్ లుక్ సహకారంతో మరో వారం రోజుల్లో అతని మృత దేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. అనూప్ రెడ్డి ప్రమాదవశాత్తు చనిపోయాడా? మరేమైనా కారణాలు ఉన్నాయా? అనేది లూసియానా పోలీసుల దర్యాప్తు తర్వాత తేలనుంది.
హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్మెట్ మండలం కావడిపల్లి గ్రామానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజేందర్ రెడ్డి, దుర్గ భవాని దంపతులకు అనురూప్రెడ్డి రెండో సంతానం. మొదటి కుమారుడు ఆశ్రీత్ రెడ్డితో పాటు అనురూప్రెడ్డి సైతం ఐదేళ్ల క్రితం అమెరికాకు వెళ్లారు. యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్లో మాస్టర్ గ్రాడ్యుయేషన్ ఇటీవల పూర్తి చేశారు. జూన్ నుంచి ఉద్యోగ అన్వేషణ చేయాల్సిన క్రమంలో.. ఇలా విగతా జీవిగా చూస్తామని అనుకోలేదని అతని కుటుంబం, సన్నిహితులు కన్నీటి పర్యంతమయ్యారు. అనురూప్రెడ్డికి ఫోటోగ్రఫీ ఎంతో ఇష్టం, సామాజిక సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనేవాడని అతని సోదరుడు తెలిపారు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువకుడు స్నేహితుల కోసం తన ప్రాణాలను పణంగా పెట్టడం ప్రతి ఒక్కరినీ కలచివేసింది.





Total views : 90260